శభాష్‌: దేశవిభజనపై ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు..?

Chakravarthi Kalyan
ఆంగ్లేయులు భారత్‌ను వదిలి వెళ్లే ముందు ఇండియా ఓ అఖండ భారతం, ప్రస్తుతం ఉన్న భారత్, పాక్, బంగ్లాదేశ్ కలిసి ఉన్న సువిశాల భారతం. కానీ.. ఆగస్ట్ 15న ఇండియాకు స్వాతంత్ర్యం ఇస్తామని ప్రకటించిన తెల్లదొరలు.. అందుకు ఒకరోజు ముందే పాకిస్తాన్‌ను ఇండియా నుంచి విడదీసి స్వాతంత్ర్యం ప్రకటించారు. ఈ దేశ విభజన.. లక్షల మంది ప్రాణాలను బలికొన్నది. ప్రధానంగా దేశ విభజన సమయంలో పాక్‌ నుంచి వచ్చిన రైళ్లలో వేల శవాలు ఉన్న దృశ్యాలు  భారత దేశ చరిత్రలోనే మాయని మచ్చలుగా మిగిలాయి.


దేశ విభజన తర్వాత మొదలైన మరో గాయం.. కాశ్మీర్‌.. ఈ ప్రాంత రాజు ఇండియాలో తన రాజ్యాన్ని కలిపేసినా అక్కడ జనం మెజారిటీ ముస్లింలు కాబట్టి.. ఇది తమ ప్రాంతమే అని పాక్ వాదించింది. ఆ మేరకు ఇండియాతో యుద్ధానికి కాలు దువ్వింది. కొంత భాగం ఆక్రమించింది కూడా. అప్పటి నుంచి కాశ్మీరం రాజుకుంటూనే ఉంది. అయితే.. కాశ్మీర్‌లోని ప్రధాన పార్టీలు మాత్రం ఇప్పటికీ తమ దేశ భక్తిని చాటుకుంటూనే ఉంటారు. తాజాగా జమ్ముకశ్మీర్‌ మాజీ సీఎం ఫరూఖ్‌ అబ్దుల్లా మాట్లాడుతూ.. మత ప్రాతిపదికన దేశ విభజన జరగడం కచ్చితంగా చారిత్రక తప్పిదమేనని అన్నారు.


పాకిస్థాన్‌ కావాలని మహమ్మద్‌ అలీ జిన్నా చేసిన డిమాండ్ అనుచితమన్న అబ్దుల్లా.. పాక్ భారత్‌లోనే ఉంటే.. ముస్లింలకు 26 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాల్సిన చోట 39శాతం రిజర్వేషన్‌ ఇవ్వాల్సి వచ్చేదన్నారు. జిన్నా చేసిన ఈ ప్రతిపాదనకు అప్పటి కాంగ్రెస్‌ అంగీకరించలేదని.. అందుకే జిన్నా దేశ విభజనకు మొగ్గు చూపారని అబ్ధుల్లా అభిప్రాయపడ్డారు. జిన్నా తప్పిదంతో జరిగిన ఈ దేశ విభజన వల్ల కశ్మీరీలేకాదు.. భారత్‌లో ఉన్న ముస్లింలు కూడా ఇబ్బందులు పడుతున్నారని అబ్దుల్లా అన్నారు.


అఖండ భారత్‌ ఒక్కటిగా ఉండి ఉంటే  కాశ్మీరీలకు ఈ కష్టాలు ఉండేవి కావన్న అబ్దుల్లా.. అప్పుడు అంతా ఐక్యంగా, సోదరభావంతో ఉండేవారని అన్నారు. భారత్‌, పాక్ విభేదాల వల్లే ఇప్పుడు మత సమస్యలు పెరుగుతున్నాయని ఫరూఖ్‌ అబ్దుల్లా అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: