కోవర్టులు సరే బాబు..ఆ బ్యాచ్‌కు కూడా స్వస్తి చెప్పండి!

M N Amaleswara rao
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఇప్పుడుప్పుడే జ్ఞానోదయం అవుతున్నట్లు కనిపిస్తోంది. ఇంతకాలం టీడీపీ ఎందుకు ఓడిపోయిందో అనే విషయాన్ని వదిలేసి...ఎంతసేపు జగన్‌ని తిట్టడంపైనే బాబు ఎక్కువ ఫోకస్ చేశారు. అసలు ప్రతిరోజూ భోజనం చేస్తున్నారో లేదో తెలియదు గానీ...జగన్‌పై విమర్శలు మాత్రం చేయకుండా ఉండటం లేదు. ఎంతసేపు జగన్‌ని తిడుతూ కూర్చోవడం వల్ల టీడీపీ ఇంకా పుంజుకోలేదు. ఎన్నికలై రెండున్నర ఏళ్ళు అయినా సరే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు పార్టీ పరిస్తితి ఉంది.

వరుసపెట్టి పంచాయితీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయినా సరే బాబులో మార్పు రాలేదు. కానీ ఇటీవల కుప్పం మున్సిపాలిటీలో కూడా దారుణంగా ఓడిపోవడంతో బాబుకు అసలు సినిమా అర్ధమైనట్లు ఉంది. ఎంతసేపు జగన్‌పైనే విమర్శలు చేయడం కాదు..సొంత పార్టీలో కూడా మార్పులు చేయాలని అర్ధమైంది. అందుకే పార్టీని ప్రక్షాళన చేసేస్తా...కోవర్టులని ఏరిపారేస్తాను...పనిచేయని నాయకులని పక్కనబెట్టేస్తానని బాబు డైలాగులు వేసేస్తున్నారు.

తాజాగా కుప్పం మున్సిపాలిటీలో ఓటమిపై స్థానిక నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించిన బాబు..బాగా ఫ్రస్టేట్ అయిపోయారు...సొంత నియోజకవర్గంలో చావుదెబ్బ తినడంతో...బాగా ఆగ్రహంతో ఊగిపోయారు. పార్టీలో ఉంటూ వేరే పార్టీలకు లొంగిపోయి పనిచేస్తున్న నేతల వల్లే ఓడిపోయామని అంటూ...వారిని పార్టీలో నుంచి తొలగిస్తానని చెప్పారు. అసలు కుప్పంలోనే కాదు...రాష్ట్రంలో ఎక్కడ ఉన్నా సరే కోవర్టులని ఏరేస్తానని బాబు హడావిడి చేసేశారు.

అయితే ఇలా భారీ డైలాగులు కొట్టిన బాబు...చేతల్లో ఏ విధంగా చూపిస్తారనేది చూడాలి. అదే సమయంలో కోవర్టులనే కాకుండా...పార్టీలో భజన చేసే బ్యాచ్‌ని కూడా సైడ్ చేయాలని టీడీపీ కార్యకర్తలు కోరుకుంటున్నారు. గ్రౌండ్ లెవెల్‌లో పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోకుండా....ఆహా...ఓహో అంటూ బాబుని పొగిడే నేతలు చాలామంది ఉన్నారు. వారిపై కూడా బాబు ఫోకస్ చేస్తే..కాస్త పార్టీ బాగుపడుతుందని తమ్ముళ్ళు అంటున్నారు. అసలు డైలాగులు వేయకుండా...చేతల్లో ఈ పనులు చూపిస్తే బెటర్ అంటున్నారు. మరి చూడాలి బాబు...కోవర్టులని ఎంతవరకు బయటకు పంపుతారో?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: