టాలీవుడ్ లో విషాదం.. నటుడు జీవా తండ్రి మృతి..!

Divya
తెలుగు ,తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర భాషలలో కూడా దాదాపుగా వందకు పైగా సినిమాలను నిర్మించిన నిర్మాతగా పేరు సంపాదించారు ఆర్.బి చౌదరి. రాజస్థాన్లోని ఉదయపూర్ లో ఓ పని నిమిత్తం కోసం వెళ్లిన ఆర్ బి చౌదరి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. అయితే అక్కడివారు హుటాహుటిగా  ఆసుపత్రికి చేర్చేలోపే తుది శ్వాస విడిచినట్లు తెలుస్తోంది. ఈ విషయం విన్న అటు సినీ సెలబ్రిటీలు, కుటుంబ సభ్యులు సైతం శోకసముద్రంలో మునిగిపోయారు. ఆర్ బి చౌదరి  పార్థివ దేహాన్ని మే 6 (బుధవారం) చెన్నైకి తరలించనున్నారు. అక్కడే అంతిమ నమస్కారాలు  కూడా నిర్వహించబోతున్నట్లు సమాచారం.


ఇక ఆర్ బి చౌదరికి ఇద్దరు కుమారులు ఒకరు జీతన్ రమేష్, మరొకరు జీవా. జీవా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమే రంగం, స్నేహితుడు, బ్లాక్,యాత్ర 2 తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను కూడా బాగా అలరించారు. ఆర్ బి చౌదరి 1988లో సూపర్ గుడ్ ఫిలిమ్స్ అనే నిర్మాణ సంస్థను మొదలుపెట్టారు. తెలుగులో సూర్యవంశం, రాజా, సుస్వాగతం తదితర చిత్రాలను తెరకెక్కించారు. అలా తమిళ, మలయాళం వంటి భాషలలో కూడా ఎన్నో చిత్రాలను నిర్మించారు ఆర్.బి చౌదరి. చివరిగా మరీసన్ తమిళ సినిమాని నిర్మించారు.


ఆర్ బి చౌదరి రెగ్యులర్గా ఉదయ్ పూర్ కి వెళ్తుండేవారు.అలా మంగళవారం రోజు కూడా వెళ్లగా దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదం బారిన పడ్డారు. సోషల్ మీడియా వేదికగా పలువురు సినీ సెలబ్రిటీలు సైతం ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఆర్.బి చౌదరి మరణం పైన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ నివాళులు అర్పించారు. శ్రీ ఆర్ బి చౌదరి గారి మరణం తనని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించారనే వార్త తాను నమ్మలేకపోయానని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను అంటూ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: