ఆంధ్రావనిలో రెండు ప్రధాన పార్టీల మధ్యే ఏడున్నరేళ్లుగా యుద్ధం సాగుతోంది. ఈ యుద్ధానికి ఆరంభం ఎక్కడో అంతిమం ఏంటో కూడా తెలియడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏ రెండు పార్టీలూ ఇంతగా కొట్లాటలో లేవు. కానీ అవశేషాంధ్రకు మాత్రం ఆ రెండు పార్టీలే ప్రాణ దీపాలు అవుతున్నాయి. రాజకీయాలకు, రాజీ మార్గాలకు అవే ప్రధాన భూమిక పోషించి తమ సత్తా చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే అధిపత్య పోరు నెలకొంటోంది. రెండు పార్టీల అధినేతలూ ఆశించిన తీరున దిగువ స్థాయి నాయకులు పనిచేయని రోజున వీరంతా సెంటిమెంట్ డ్రామాలకు తెరలేపుతున్నారు. దీంతో రాజకీయం యూ టర్న్ తిరిగి ప్రజా సమస్యలు అన్నవి ఎవ్వరికీ పట్టకుండా పోతున్నాయి.
రెండు తీవ్ర తుఫానులకు పంటలన్నీ పోయి నానా అవస్థలూ పడుతున్న రైతుకు తిండి గింజలు లేవు అన్న విషయం విస్మరించి పనికిమాలిన రాజకీయం మాత్రం యథేచ్ఛగా నడుపుతున్నారన్న విమర్శ జనం నుంచి వస్తోంది. ఈ క్రమంలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వేళ కూడా ఇలాంటి సెంటిమెంట్ రాజకీయాలనే నడిపారు. ఇప్పుడు అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా కూడా ఇలాంటి రాజకీయాలకే తెరదీశారు.
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు భార్యను ఉద్దేశించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారన్నది పసుపు పెద్దల ఆరోపణ. ఇది అవునో కాదో తెలియడమో నిర్థారణ జరగడమో కావాలి. కానీ ఆ తరువాత కూడా వ్యాఖ్యలకు అనుగుణంగా మరికొంత రచ్చ జరిగింది. మీడియా కేంద్రంగా వంశీ వల్లభనేని కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం తరువాత క్షమాపణలు చెప్పడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. కానీ జరగాల్సిన నష్టం వైసీపీకి ఎప్పుడో జరిగిపోయింది. దీంతో పరువు పోగొట్టుకున్నాక నష్ట నివారణ చర్యలకు దిగి ఏం లాభం అన్న వాదన ఒకటి వినిపిస్తోంది. దీంతో నిన్నటి వేళ కొందరు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ భువనేశ్వరి కాళ్లు తమ కన్నీళ్లతో కడుగుతాం అని అంటున్నారు. ఇదంతా రాజకీయంగా మైలేజీ పెంచుకునేందుకేనా లేదా నిజంగానే వైసీపీలో రియలైజేషన్ వచ్చిందా?