వారెవా: ఆ ఒక్క మాత్రతో కరోనాకు చెక్..?
ఇప్పుడు కొత్తగా కరోనా చికిత్సకు మాత్రలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజం ఫైజర్ యాంటీ వైరల్ మాత్రను అందుబాటులోకి తెచ్చింది. ఈ మాత్ర సమర్థంగా పనిచేస్తున్నట్లు ఇప్పటికే ప్రయోగ పరీక్షల్లో తేలిందట. కరోనా వచ్చిన వారు ఈ మాత్ర వేసుకుంటే ఆస్పత్రుల్లో చేరే అవసరం రానేరాదట. అంతే కాదు.. ఈ మాత్రతో 90శాతం మేర మరణాలను తగ్గించవచ్చట. దీంతో కరోనా చికిత్సకు తొలి సులభమైన ఔషధంగా ఈ మాత్రను చెబుతోంది ఫైజర్ సంస్థ.
ఫైజర్ సంస్థ ఈ మాత్రను 775మందిపై ప్రయోగించి చూసింది. ఈ ప్రాథమిక పరీక్షల ఫలితాలను ఫైజర్ విడుదల చేసింది. వ్యాక్సిన్ తీసుకోనివారు, స్వల్ప నుంచి ఓ మోస్తరు కొవిడ్ లక్షణాలు కలిగిన వారిపైనా ప్రయోగాలు చేసింది. అంతే కాదు. ఆస్పత్రిలో చేరే ముప్పున్న ఊబకాయం, మధుమేహులు, హృద్రోగ వ్యాధులున్న వారిపైనా ఈ ప్రయోగం నిర్వహించారు. కరోనా లక్షణాలు ప్రాథమిక దశలో ఉన్నవారిపై 3నుంచి 5 రోజులలోపు చికిత్స ప్రారంభించారు. వారిలో కొంత మందికి ఫైజర్ మాత్రతోపాటు యాంటివైరల్ డ్రగ్ ఇచ్చారు.
ఈ ఫైజర్ మాత్ర తీసుకున్న వారిలో ఆస్పత్రిలో చేరే అవసరం 90శాతం తగ్గిపోయిందట. ఆ మిగిలిన ఒక శాతం మందిలోపు ఆస్పత్రిలో చేరినా ఎవరూ వైరస్తో మరణించలేదట. బాగానే ఉంది. ఈ కరోనా మాత్ర అందుబాటులోకి వస్తే వయసు మీరిన వారికి ఉపయుక్తంగా ఉంటుంది. అయితే ఈ కరోనా మాత్రకు ఇంకా అనుమతి రావాల్సి ఉంది. కొన్ని వారాలు, నెలల్లో అనుమతి వచ్చే అవకాశం ఉందని ఫైజర్ చెబుతోంది.