ఛలో వైజాగ్ : ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ ఇటు వైపే?
రాష్ట్రం విడిపోయాక ఇండస్ట్రీ అంతా హైద్రాబాద్ లోనే ఉండిపోయింది. వైజాగ్ తో సహా ఇతర ప్రాంతాలలో ఒకప్పుడు షూటింగ్ లు చేసిన విధంగా ఇప్పుడు జరగడం లేదు. అరకు లాంటి సహజ సిద్ధ ప్రకృతి సౌందర్యంతో అలరారుతున్న ప్రాంతాలకు సైతం పెద్దగా రావడం లేదు. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ పెద్దలను ఇటుగా రప్పించేందుకు అవంతి శ్రీను లాంటి మంత్రులు ప్రయత్నిస్తున్నారు. సినిమాల రూపకల్పన కు ఎక్కువగా ఈ ప్రాంతానికి ప్రాధాన్యం ఇవ్వాలని, తద్వారా మరింతమంది స్థానికులకూ, ఔత్సాహికులకూ ఉపాధి దక్కుతుందని అంటున్నారు వైసీపీ పెద్దలు.
రాష్ట్రం విడిపోయాక పెద్దగా ఆర్థిక వనరులు లేని ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ మిగిలి పోయిందని, చిన్న చిన్న నిర్మాతలు మొదలుకొని, పెద్ద పెద్ద నిర్మాతల వరకూ ఇటుగా షూటింగ్ లకు ప్రాధాన్యం ఇస్తే ఇక్కడి అభివృద్ధి నలుగురికీ తెలియడంతో పాటు పారిశ్రామిక పెట్టుబడులు మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుందని అంటున్నారు. ఆ రోజు హైద్రాబాద్ అభివృద్ధిలో ఇండస్ట్రీ పెద్దలు ఎంతో కీలకం అయ్యారు. ఆర్ఎఫ్సీ లాంటి ప్రపంచ స్థాయి స్టూడియోల నిర్మాణంకు పూనుకున్నారు. అదే విధంగా వైజాగ్ పై కూడా దృష్టి నిలిపితే ప్రపంచం గర్వించదగ్గ స్థాయి లో నగర నిర్మాణం, అభివృద్ధి సాధ్యం అవుతుంది. ఇదే భావనలో భాగంగానే జగన్ ను ఇండస్ట్రీ పెద్దలు కొన్ని రాయితీలు అడుగుతున్నారు. భీమిలి పరిసర ప్రాంతాలలో స్టూడియోల నిర్మాణానికి అవకాశం ఇచ్చేలా, అందుకు తగ్గ రీతిలో స్థల కేటాయింపులు చేయాలని కోరుతున్నారు. అన్నీ బాగుంటే జగన్ అనుకున్న విధంగా ఇండస్ట్రీ ఇటు రావడం ఖాయం.