హుజురాబాద్లో మైలేజీ కోసం టీఆర్ఎస్ మళ్లీ ఆ పని..!?
ఈటల రాజేందర్ రాజీనామా తర్వాత తొలిసారి సీఎం కేసీఆర్ హుజురాబాద్లో పర్యటించారు. ఆగస్టు 16న దళిత బంధు పథకాన్ని హుజురాబాద్లోనే ఆయన ప్రారంభించారు. అయితే ఐదు నెలల ప్రచారంలో టీఆర్ఎస్కు చెప్పుకోదగ్గ సభ అదొక్కటే అని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఆ తర్వాత హరీశ్ రావు కుల సంఘాలతో సమావేశాలు పెట్టి తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే మండలాల ఇన్ఛార్జిలు ఐదు నెలలుగా హుజురాబాద్లో ప్రచారం చేస్తున్నా.. అది అనుకున్నంత సక్సెస్ కాలేకపోతోందన్న భావన ఆ పార్టీ శ్రేణుల్లో ఉంది. ఎంత తిరిగినా.. ఎంత చేస్తున్నా టీఆర్ఎస్కు మైలేజీ రావడం లేదని ఆ పార్టీ నేతల అంతర్గత చర్చల్లో ప్రస్తావనకు వచ్చింది. దీంతో హుజురాబాద్లో ఓటర్ల మైండ్ సెట్ తమ వైపునకు తిప్పుకోవాలంటే సీఎం కేసీఆర్ తోనే సాధ్యం అవుతుందని ఆ పార్టీ భావిస్తోంది. అందుకే రెండోసారి కేసీఆర్తో సభ ప్లాన్ చేస్తోంది. ఎన్నికల కోడ్ లేని, మండలాల్లో కేసీఆర్ సభ పెట్టాలని టీఆర్ఎస్ వర్గాలు ఆలోచన చేస్తున్నాయి.
మూడు మండలాల టీఆర్ఎస్ ఇన్ఛార్జిలు, నాయకుల్లో వ్యక్తమైన అభిప్రాయాన్ని ఇటీవల కేసీఆర్ దృష్టికి మంత్రి హరీశ్రావు తీసుకెళ్లారట. అయితే పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల కలెక్టరేట్లు, మెడికల్ కాలేజీల భవనాల నిర్మాణాలకు శంకుస్థాపనలు ఇంకా మిగిలే ఉన్నాయి. ఆ జిల్లాల్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలోనే కేసీఆర్ పర్యటనలు ఉండేలా చూస్తున్నారు. కేసీఆర్ కూడా పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో పర్యటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.