చైనా ప్రభుత్వానికి భారత దేశం అంటే పడదు అని అందరికీ తెలిసిన విషయమే.. కానీ, అక్కడ ఉన్న కొన్ని కంపెనీలకు కూడా భారత్ అంటే ద్వేషం ఉన్నట్టుగా కనిపిస్తోంది. అవకాశం దొరికినప్పుడల్లా ఇండియాపై విషం చిమ్ముతున్నాయి డ్రాగన్ కంపెనీలు. తాజాగా చైనాకి చెందిన ఓ పెద్ద కంపెనీ భారతీయులపై తన అక్కసును నీచ మార్గంలో వ్యక్తం చేసింది. చిన్నపిల్లలు ధరించే దుస్తులపై భారతీయులను కించపరిచేలా, వారి మనసులు గాయపడేలా విద్వేష పూరిత వ్యాఖ్యలను ప్రింట్ చేసింది.
ప్రముఖ బ్రాండ్ అయిన జేఎన్బీవై ఈ దుష్టర్యకు పాల్పడింది. ఇది చైనాలో ప్రముఖ క్లాతింగ్ బ్రాండ్ అయిన ఈ కంపెనీకి సుమారు 2 వేల స్టోర్లు ఉన్నాయి. అమెరికా, కెనడా వంటి దేశాల్లో కూడా జేఎన్బీవై స్టోర్లు కనిపిస్తాయి. చైనాకు చెందిన మోగు అనే యువతి కొడుక్కి వాళ్ల తాతయ్య, నానమ్మ ఇటీవల బ్రాండెడ్ దుస్తులు కొనిచ్చారు. అయితే వారిద్దరికీ ఇంగ్లీష్ రాకపోవడంతో ఆ బట్టలపై ఉన్న కామెంట్లు అర్థం కాలేదు.
కానీ మోగు ఈ టీషర్ట్ పై ఉన్న రాతలను చూసి మండి పోయింది. ‘నరకానికి స్వాగతం’ అంటూ ప్రింట్ చేసిన బట్టల ఫొటోను సోషల్ మీడియాలో మోగు షేర్ చేసింది. 2018 నుంచి ఈ కంపెనీకి చెందిన దుస్తులపై ఇలా నీచపు రాతలు కనిపిస్తున్నాయని ఆరోపించింది ఆమె. దీని గురించి సోషల్ మీడియాలోనే కాకుండా, స్థానికంగా ఉన్న స్టోర్ల ఎదుట కూడా కొందరు నిరసన వ్యక్తం చేశారని చెప్పింది. అయినా కంపెనీ తమ వైఖరి మార్చుకోలేదని ఆరోపించింది.
‘ ఒక చిన్న పిల్లాడు ఇలాంటి మాటలున్న దుస్తులు ధరించ వలసి వస్తుందని తలచుకుంటేనే భయమేస్తోంది ’ అని సోషల్ మీడియా వేదికగా తన అసంతృప్తి వ్యక్తం చేసింది మోగు. ఆ తర్వాత మరో వ్యక్తి కూడా ఒక ఫొటో షేర్ చేశారు సోషల్ మీడియాలో. ‘ఈ ప్రాంతం అంతా భారతీయులతో నిండిపోయింది, నేను ఈ తుపాకీ తీసుకొని వాళ్లందరి ముక్కలు ముక్కులుగా కాలుస్తా ’ అంటూ ఆ దుస్తులపై ఓ స్లోగన్ రాసి ఉంది.
ఇది వివాదానికి దారి తీయడంతో జేఎన్బీవై కంపెనీ క్షమాపణలు తెలిపింది. ఇలాంటి రాతలు ఎలా ప్రింట్ అయ్యాయో తమకు తెలియదని, ప్రిటింగ్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తామని పేర్కొంది. అయితే భారతీయులను కించపరుస్తూ చేసిన ప్రింట్లపై మాత్రం ఏ విధంగా స్పందించలేదు.