బండి పాదయాత్రతో బీజేపీ మైలేజ్ పెరిగిందా..?
అదే దారిలో బండి సంజయ్ తెలంగాణలో బీజేపీ జెండా ఎగురవేయాలనే ఉద్దేశ్యంతో ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర మొదలు పెట్టారు. ఈ పాదయాత్రలో భాగంగా ఊరూరా తిరుగుతూ కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. గతంలో పాదయాత్రలు చేసిన రాజకీయ నాయకులు ఎందరో ఉన్నారు. అందులో కొందరు నాయకులు తమ పాదయాత్రలతో పార్టీలకు అధికారం తెచ్చినవారు ఉన్నారు. వారిలో దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒకరు.. తన పాదయాత్ర ద్వారా ఉమ్మడి ఆంద్రప్రదేశ్ ప్రజలకు దేవుడు అయ్యారు.
ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి సీఎం గా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా పాదయాత్ర ద్వారానే అధికారం చేపట్టారు. అలాగే చంద్రబాబు నాయుడు చేసిన పాదయాత్రలో ప్రజలను పట్టించుకోలేదని పేరు తెచ్చుకున్నాడు. అయితే, ఇప్పుడు బండి సంజయ్ చేస్తున్న పాదయాత్రతో తెలంగాణలో బీజేపీ ప్రభావం ఏమైనా పెరిగిందా.. అంటే కాస్త పెరిగింది అనే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. బండి సంజయ్ పాదయాత్ర మొదలు పెట్టిన నాటి నుంచి ఆ పార్టీలో ప్రజలు చేరుతూనే ఉంటున్నారు. పాదయాత్ర పూర్తి అయ్యే సరికి ఇంకా కాషాయ దళానికి సైన్యం ఇంకా పెరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే పార్టీ బలోపేతానికి కేంద్రం నుంచి బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి ఫుల్ సపోర్ట్ ఇచ్చింది.