విభజన ఆంధ్ర పోరాడడంలో ఎన్నడూ వెనుకడుగు వేస్తూనే ఉంది. ఇదే సమయంలో కేసీఆర్ కూడా తన వంతు బాధ్యతను మరిచిపోవడంలో ఆంతర్యం అంతుచిక్కడం లేదు. ప్రాంతీయ స్పృహ లేని నేతలంతా తెలుగు రాష్ట్రాల లోనే ఉన్నారన్న అపవాదు ఒకటి స్థిరపడిపోతుంది అనేందుకు తార్కాణమే ఇద్దరి ముఖ్యమంత్రుల ప్రవర్తన. ఢిల్లీలో తెలంగాణ ఇంటి పార్టీ నిర్మాణానికి వసంత విహార్ దగ్గర 1300 చదరపు అడుగులు కేటాయించిన మోడీ, నిధులు ఎందుకు ఇవ్వడం లేదు అన్నది అంతుపట్టదు.
బయట మాత్రం బాహాబాహీగా కొట్టుకున్నా కేసీఆర్ కు బీజేపీ అత్యంత సన్నిహితంగానే ఉంటుంది. భాగ్యనగరిలో బండి సంజయ్ లాంటి నేతలు కేసీఆర్ ను తిట్టినా అవన్నీ రాజకీయంలో భాగమేనని తేలిపోయింది. కేసీఆర్ కూడా మునుపటి వేగంలో లేరు. పార్టీని జాతీయ స్థాయికి తీసుకుని పోవాలన్న తపనైతే ఉంది కానీ అందుకు ఉన్న అడ్డంకులను తొలగించాలన్న యోచన కానీ కార్యాచరణ కానీ ఆయనలో లేదు అన్నది వాస్తవం.
దీంతో తెలంగాణ ఇంటి పార్టీ ఎప్పటికీ ప్రాంతీయ పార్టీగానే ఉండిపోతుంది అనేందుకు ఆధారాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించే విషయమై కేసీఆర్ కు మోడీ సాయం చేసింది లేదు. అదేవిధంగా మనలానే తెలంగాణకు వెనుకబడిన ప్రాంతాలు అనేకం ఉన్నాయి. వాటి అభివృద్ధికి నిధులు ఇచ్చింది లేదు. ఇప్పటిదాకా గిరిజన విద్యాలయం ఏర్పాటుకు సంబంధించి కానీ లేదా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కానీ లేనే లేదు. విభజన చట్టంను ఇంతగా పట్టించుకోకపోయినా రెండు తెలుగు రాష్ట్రాలలో మోస్ట్ సీనియర్ పొలిటిషియన్ అయిన కేసీఆర్ బీజేపీని నిలదీయడం లేదు. ఎందుకనో ఆయన ఆ పని చేయడం లేదు. తెలంగాణ భవన్ కు హస్తినపురిలో స్థలం కేటాయించండి ఇల్లు కట్టుకుంటాం అని అంటారే కానీ తెలంగాణ భవిష్యత్ ను మార్గనిర్దేశం చేసే ఏ ఒక్క జాతీయ ప్రాజెక్టునూ ఆయన సాధించలేకపోయారు. ఇవన్నీ మోడీకి అనుకూలాంశాలు. ప్రాంతీయంగా బీజేపీ బలపడకపోయినా రేపటి వేళ ఇంటి పార్టీ పతనానికి ఇవే సహాయకారులుగా ఉంటాయి. అప్పుడు మోడీ సీన్ లోకి వచ్చి వరాలు ఇస్తే, వాటిపై ఆశలు పెంచుకుని జనం బీజేపీ వైపు మొగ్గు చూపేందుకు అవకాశాలే పుష్కలం. ఆ విధంగా ఇంటి పార్టీని ఇంటికే పరిమితం చేయాలన్న ఆలోచన మోడీది.