దేశమా సిగ్గుపడు.. 363 మంది ఎంపీ, ఎమ్మెల్యేలకు నేర చరిత్ర..?

Chakravarthi Kalyan
రాజకీయాలు ఓ పవిత్ర వ్యాసంగం అన్న రోజులు ఏనాడో  పోయాయి.. రాజకీయాల్లో ధన ప్రభావం విపరీతంగా పెరిగింది. దీనికి తోడు నేతలు, నేరగాళ్లు చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారు. అది కూడా ముదరిపోయింది.. ఇప్పుడు నేరగాళ్లే నాయకులై చెలామణీ అవుతున్నారు. పారిశ్రామిక వేత్తలు కూడా ఎవడినో మేపడం ఎందుకు.. మనమే నాయకులైతే పోలా అన్నట్టు రాజకీయాల్లో దిగిపోతున్నారు. ఇప్పుడు దేశంలో ఉన్న రాజ్యసభ ఎంపీలను చూస్తే ఈ విషయం అర్థమైపోతుంది.


ఇక ఇప్పుడు దేశవ్యాప్తంగా 363 మంది ఎంపి, ఎంఎల్‌ఎలపై ఏకంగా కోర్టులే నేరాభియోగాలు నమోదు చేశాయని అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ సంస్థ చెబుతోంది. ప్రజాప్రాతినిధ్య చట్టం కింద కోర్టులు వీరిపై నేరాభియోగాలు నమోదు చేశాయి. ఈ సంస్థ 2019 నుంచి 2021 వరకు 2,495 మంది సిట్టింగ్‌ ఎంపీలు, ఎంఎల్‌ఎలు దాఖలు చేసిన అఫిడవిట్లు పరీక్షించి ఈ లెక్కలు తేల్చింది. నేరాభియోగాలు ఎదుర్కొంటున్నవారిలో  296 మంది శాసనసభల సభ్యులు, 67 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు.


ఇక ఈ ఘనాపాఠీల్లో  పార్టీల వారీగా లెక్కలు చూస్తే అధికార పార్టీ బీజేపీకి చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. నేరాభియోగాలు ఎదుర్కొంటున్న వారిలో అత్యధికంగా అధికార బీజేపికి చెందిన వారు  83 మంది. ఆ తర్వాత స్థానం కాంగ్రెస్‌ది. ఈ పార్టీ నుంచి 47 మంది నేరాభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఆ తర్వాత 25 మంది తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు.. 22 మంది వైసీపీ నేతలు.. 22 మంది బీజేడీ నాయకులు ఉన్నారు.


నేరాభియోగాలు ఎదుర్కొంటున్న ఎంపీలు ఎక్కువగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేశారు. ఇక 2020 బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 54 మంది, 2021 కేరళ ఎన్నికల్లో గెలిచిన వారిలో 42 మంది శాసనసభ్యులపైనా అభియోగాలు ఉన్నాయి. ఇక అభియోగాలు ఎదుర్కొంటున్నవారిలో ఏకంగా నలుగురు కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. వివిధ రాష్ట్రాల్లోని మంత్రులుగా ఉన్న 35 మందిపైనా అభియోగాలు నమోదయ్యాయి. ఇదీ మన నేతల ఘనత. అవునూ.. వాళ్లంతా మనం ఓట్లేస్తేనే కదా ఎన్నికైంది. తప్పు మనదే అన్నమాట.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: