ప్రజలపై పెట్రో భారం.. ఎద్దులపై నేతల భారం.. చివరికి జరిగింది ఇదే..!

NAGARJUNA NAKKA
వరుసగా పెరుగుతున్న పెట్రోల్ ధరలపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. మహారాష్ట్రలోని ముంబయిలో హస్తం పార్టీ నేతలు, కార్యకర్తలు ఎద్దుల బండిపై నిరసన వ్యక్తం చేశారు. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను వ్యతిరేకిస్తూ ప్లకార్డులు, గ్యాస్ సిలిండర్లతో ప్రదర్శన చేపట్టారు. ఇదిలా ఉండగా ఎడ్లబండిపై  పెద్ద ఎత్తున నేతలు ఎక్కారు. దీంతో ఎద్దులపై భారం ఎక్కువయిపోయింది. వారందరినీ మోయలేక తీవ్ర ఇబ్బందులు పడ్డాయి. బెదిరిపోయాయి.  ఒక్కసారిగా ఎద్దుల బండిపై ఉన్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కుప్పకూలిపోయారు.  ఈ ఘటనలో పెద్ద ప్రమాదమేమీ జరుగలేదు. స్వల్పగాయాలతో నేతలు, కార్యకర్తలు బయటపడ్డారు. గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పెట్రోల్ ధరలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పది రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. వెంటనే ఇంధన ధరలు తగ్గించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.  

అసలే కరోనా.. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ కుదేలయింది. ఉన్న ఉద్యోగాలు ఊడాయి. లాక్ డౌన్ దెబ్బకు వ్యాపారాలు తీవ్ర నష్టాలను చవిచూశాయి. విద్యార్థులు ఇంటికే పరిమితమయ్యారు. అసలే జీతాల్లేవు.. కూలి పనులు లేవు.. తినడానికి సరైన తిండిలేదు. కటుంబం గడవడమే చాలా కష్టమైన పరిస్థితులొచ్చాయి. పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ఎత్తివేయడంతో ఇప్పుడిప్పుడే ఆర్థిక వ్యవస్థ గాడినపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నిత్యావసర ధరలు భగ్గుమంటున్నాయి. ఆయిల్, పప్పు.. ఉప్పు.. కూరగాయల రేట్లు భగ్గుమంటున్నాయి. ఇది చాలదన్నట్టు గ్యాస్, పెట్రోల్, డీజిల్ రేట్లను చమురు సంస్థలు ఇష్టమొచ్చినట్టు పెరిగిపోయాయి. పెట్రోల్ అయితే సెంచరీ దాటిపోయింది. ఇంట్లో వినియోగించే గ్యాస్ ధర రూ.900రూపాయలు దాటింది. ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు అనే దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు ప్రజలు.

ఒక్కసారిగా ఊహించని ఘటన జరుగడంతో.. అంతా షాక్ కు గురయ్యారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: