పీసీసీ చీఫ్‌గా రేవంత్‌ రెడ్డి తొలి గర్జన..?

Chakravarthi Kalyan
ఎట్టకేలకు తెలంగాణ పీసీసీ పీఠంపై కొత్త అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కొలువు దీరారు. ఎన్నాళ్లనుంచో పెండింగ్‌లో ఉన్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పూర్తి చేసింది. కాంగ్రెస్‌లో డైనమిక్‌ లీడర్‌గా పేరున్న రేవంత్ రెడ్డినే పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది. పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి.. తొలి రోజే గర్జించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొస్తామని పీసీసీ కొత్త అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన వెలువడగానే రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు జానారెడ్డి, షబ్బీర్‌ అలీ నివాసాలకు రేవంత్‌ వెళ్లి మర్యాదపూర్వకంగా వారిని కలిశారు.


అలాగే మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు కోమటిరెడ్డి సోదరులను, వీహెచ్‌ను కలుస్తానని రేవంత్‌ రెడ్డి అంటున్నారు. బడుగు బలహీన వర్గాలు, అమర వీరుల ఆశయాల కోసం పనిచేస్తామని రేవంత్‌ రెడ్డి అన్నారు. రాహుల్‌, సోనియా గాంధీ ఆలోచన మేరకు పనిచేస్తానని రేవంత్‌ హామీ అంటున్నారు. సీనియర్లందరినీ కలుపుకొని, అందరి అభిప్రాయాలు సమీకరించుకొని ముందుకెళ్తామని రేవంత్ రెడ్డి అన్నారు.


కాంగ్రెస్ పార్టీ గొప్పదనం గురించి చెబుతూ కాంగ్రెస్‌ పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి కానీ, అవి బేధాభిప్రాయాలు కాదు అని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఓ కుటుంబం అన్న రేవంత్ రెడ్డి.. కుటుంబం అన్నప్పుడు రకరకాల సమస్యలుంటాయని.. అందరం కలిసి పోరాడుతూ.. అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తానని రేవంత్ రెడ్డి అంటున్నారు.


అలాగే తొలిరోజే ఆయన బీజేపీ తీరుపైనా విమర్శలు గుప్పించారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ కుమ్మక్కయి కాంగ్రెస్‌ ను దెబ్బ తీసేందుకు ప్రయత్నిస్తున్నాయని రేవంత్ ఆరోపించారు.  ఈటలను భాజపాలోకి పంపిందే కేసీఆర్‌ అని రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రయాణించిన ప్రత్యేక విమానం ఎవరు సమకూర్చారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: