కరోనా ప్రభావం చాలా వేగంగా వ్యాపిస్తుంది.. మహమ్మారి బారిన పడిన వాళ్ళు మరణించక తప్పదు అనే విధంగా ప్రస్తుత పరిస్థితులు మారాయి. పాజిటివ్ కేసులతో సమానంగా మరణాల రేటు కూడా పెరుగుతుంది. లెక్కకు మించి కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో నిర్దేశించిన ఆసుపత్రిలో వసతి సర్దుబాటు కాక చాలా మంది ఊపిరి రోడ్లపైనే పోతుంది. ఆసుపత్రిలో బెడ్స్ దొరకడం లేదు.. దీంతో బెడ్స్ కోసం పడిగాపులు కాచి తీరా దొరికిన సమయంలో చనిపోతున్నారు. ఇది నిజంగా అమానుషం అనే చెప్పాలి..
అలాంటి పరిస్థితే ఇప్పుడు ఎదురైంది. సంగారెడ్డి జిల్లా జోగిపేటలోని వాసవీ నగర్ కాలనీకి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ కిష్టయ్య 25 ఏళ్లుగా బొడ్మట్పల్లి గ్రామం లో క్లినిక్ను ఏర్పాటు చేసి వైద్య సేవలందిస్తున్నారు. ఈ ప్రాంతంలోని 20-30 గ్రామాల్లో ఆయన వైద్యం పై అపార నమ్మకం. కిష్టయ్యకు కరోనా సోకడంతో శుక్రవారం అర్ధరాత్రి దాటాక 2.30 గంటల సమయంలో ఆయన కుమారులు హైదరాబాద్కు తరలించారు. 20కి పైగా ఆస్పత్రులు తిరిగినా ఎక్కడా బెడ్స్ దొరకలేదు.. అంతగా ప్రయత్నించిన కూడా ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి శనివారం తెల్లవారుజామున ఓ ఆస్పత్రిలో బెడ్ దొరగ్గానే వెంటనే చేర్చారు.
అయితే వైద్యులు నాడి చూసేసరికే శ్వాస ఆగిపోయింది. డాక్టర్ కిష్టయ్య జోగిపేట లైన్స్క్లబ్ సభ్యుడిగా కూడా ఉన్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే వ్యక్తి ఇలా రోజుల వ్యవధిలోనే అస్వస్థతకు గురై మృత్యువాత పడడాన్ని బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మృతదేహానికి స్వగ్రామమైన బిజిలీపూర్లో కరోనా నిబంధనల మేరకు శనివారం అంత్యక్రియలు పూర్తిచేశారు. కడచూపునకు కూడా నోచుకోకపోవడం పై ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేశారు.. ఇలాంటి అనాధ చావు ఎవరికీ రావద్దు అని కొందరు అంటున్నారు.. ఏది ఏమైనా కూడా కరోనా పుణ్యమా అంటూ మనుషుల మద్య బంధాలు కూడా కనుమరుగైయ్యాయి.