బాబోయ్.. మనం ఎంత విషపు గాలి పీలుస్తున్నామో తెలుసా..?

Chakravarthi Kalyan
పెరిగిన సౌకర్యాలతో అంతా కాలుష్యమం అయిన రోజులు ఇవి. పర్యావరణం అంటే పట్టకుండా.. ఎంతవరకూ మన సౌఖ్యం మనం చూసుకుంటూ ప్రకృతిని దారుణంగా దెబ్బ తీస్తున్నాం. అయితే దీని ఫలితాలు కూడా మనమే అనుభవిస్తున్నాయి. రాబోయే తరాలు మరింతగా బాధపడేలా ఇప్పుడు మనం ప్రవర్తిస్తున్నాం. మన చర్యల కారణంగా గాలి ఎంతగా కలుషితం అయ్యిందో తెలుస్తే గుండెలు అదరడం ఖాయం. దేశవ్యాప్తంగా గాలిలో సూక్ష్మ ధూళి కణాలు పెద్దయెత్తున పేరుకుపోవడంవల్ల జరుగుతున్న అనర్థాల తీవ్రత చాలా ఎక్కువ.
భూమి మీద ప్రతి ఎనిమిది మరణాల్లో ఒకదానికి కలుషిత వాయువే కారణమని గణాంకాలు చెబుతున్నాయి. సగటున సుమారు అయిదేళ్లదాకా పౌరుల ఆయుర్దాయాన్నీ కాలుష్యం కాటు వేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన పరిధికి 10, 11 రెట్ల మేర సూక్ష్మ ధూళి కణాలు గాలిని కలుషితం చేస్తున్నాం. కాలుష్య తీవ్రతను వివరించే కొన్ని గణాంకాలు ఇప్పుడు చూద్దాం..  2020 అక్టోబరు నుంచి మొన్న జనవరి చివరి వరకు సూక్ష్మ ధూళి కణాలు అంతకు సంవత్సరం క్రితంతో పోలిస్తే మరింత పెరిగాయి. సీఎస్‌ఈ తాజా విశ్లేషణ చెప్పిన వాస్తవం ఇది.
ఇక  కేంద్ర కాలుష్య మండలి అధికారిక ఆన్‌లైన్‌ పోర్టల్‌లో నమోదైన సమాచారం ఆధారంగా పరిశీలించిన 99 నగరాల్లో 43చోట్ల పరిస్థితి దిగజారింది. ఆ జాబితాలో గురుగ్రామ్‌, లఖ్‌నవూ, జైపూర్‌, ఆగ్రా, నవీ ముంబయి, జోధ్‌పూర్‌, కోల్‌కతాలతోపాటు విశాఖపట్నం పేరూ ఉంది. ఔరంగాబాద్‌, ఇండోర్‌, భోపాల్‌, కొచ్చి, కోజికోడ్‌ తదితరాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయినప్పుడు కాలుష్య స్థాయి భారీగా పెరిగిందట.

ఇక దేశరాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం పెరిగేకొద్దీ అయిదేళ్లలోపు పిల్లల్లో రక్తహీనత ముప్పు పెరుగుతోందట. దేశంలోని పలు ప్రాంతాల్లో వాయుకాలుష్యం పెరుగుతున్న సమయంలోనే గాలి నాణ్యత మెరుగుదల కోసం నిధుల కేటాయింపులు ఇటీవలి కేంద్ర బడ్జెట్లో తగ్గిపోవడం విశేషం. దీర్ఘకాలం వాయు కాలుష్యానికి గురైనవారి మెదడు పనితీరు దెబ్బతిని, మూత్రపిండాల సామర్థ్యమూ తగ్గిపోతోందట. వాయునాణ్యత క్షీణించి శ్వాసకోశ వ్యాధులూ పెరుగుతున్నాయట. మరి ఇకనైనా మేలుకుందామా.. వద్దా..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: