వ్యాక్సినేషన్ లో భారత్ సరికొత్త రికార్డ్..!
కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో భాగంగా వ్యాక్సిన్ పంపిణీని.. భారత్ వేగంగా చేపడుతోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఒక కోటికిపైగా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కేవలం 35రోజుల్లో కోటి మార్కును దాటినట్లు వెల్లడించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ను వేగంగా చేపడుతోన్న దేశాల్లో... అమెరికా, బ్రిటన్లు ముందుండగా, భారత్ మూడో స్థానంలో నిలిచినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.
భారత్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీని ...జనవరి 16న ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించారు. గడిచిన 35రోజుల్లోనే ఒక కోటి లక్షా 80వేల వ్యాక్సిన్ డోసులను అందించారు. దాదాపు 65లక్షల మంది వైద్యారోగ్య సిబ్బంది తొలి డోసు తీసుకోగా, వీరిలో 4లక్షల మందికి రెండో డోసు అందించారు.మరో 30లక్షల మంది ఫ్రంట్లైన్ వర్కర్లకు కూడా టీకా ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
కరోనా వ్యాక్సిన్ను వేగంగా పంపిణీ చేస్తోన్న దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో ఉంది. కేవలం 31రోజుల్లోనే అక్కడ కోటిమందికి, వ్యాక్సిన్ డోసులను అందించారు. అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రారంభించి ప్రస్తుతం 66 రోజులు పూర్తికాగా, ఐదున్నర కోట్ల డోసులను పంపిణీ చేశారు. తొలిసారిగా అధికారికంగా వ్యాక్సినేషన్ ప్రారంభించిన బ్రిటన్లో ఈ ప్రక్రియ మొదలై 72రోజులు అయ్యింది. ఇప్పటికే అక్కడ కోటి 65లక్షల మందికి టీకా పంపిణీ చేసినట్లు సమాచారం. తాజాగా భారత్ 35రోజుల్లో కోటి డోసుల మార్కును దాటినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. మొత్తానికి మన దేశంలో కరోనా ఇప్పటికీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఓ వైపు వ్యాక్సినేషన్ కొనసాగుతుంటే మరోవైపు తన పని తాను కానిచ్చేస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటకలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఇదే ఇపుడు ఆందోళన కలిగించే విషయం. ఇక కరీంనగర్ జిల్లాలో ఒక వ్యక్తి అంత్యక్రియలకు హాజరైన వ్యక్తుల్లో 30మందికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ కాగా.. వారందరూ హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు.