ప‌రుచూరు గ‌డ్డ ఏలూరి అడ్డా.... టీడీపీ జోరు... ఏక‌గ్రీవాల హోరు...!

VUYYURU SUBHASH
ప్ర‌కాశం జిల్లాలోని ప‌రుచూరు నియోజ‌క‌వ‌ర్గం టీడీపీకి, ఆ పార్టీ ఎమ్మెల్యే ఏలూరి సాంబ‌శివ‌రావుకు తిరుగులేని అడ్డా అని మ‌రోసారి స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు ఫ్రూవ్ చేస్తున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ప్ర‌భంజ‌నంలోనూ వ‌రుస‌గా రెండోసారి గెలిచిన ఏలూరి అడ్డాలో స్థానిక ఎన్నిక‌ల్లో వైసీపీ వాళ్లు నామినేష‌న్లు వేసేందుకు కూడా అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్నారు. ఇప్పటికే మూడు పంచాయ‌తీల‌ను టీడీపీ మ‌ద్ద‌తుదారులు ఏక‌గ్రీవంగా గెలుచుకున్నారు. నిన్న‌టికి నిన్న చిన‌గంజాం మండ‌లంలోని గొన‌స‌పూడి పంచాయ‌తీని టీడీపీ మ‌ద్ద‌తు వ‌ర్గానికి చెందిన విక్ర‌మ్‌దీప్తి ఏక‌గ్రీవంగా గెలుచుకున్నారు.
తాజాగా మ‌రో రెండు పంచాయ‌తీలు సైతం టీడీపీ ఖాతాలో ప‌డ్డాయి. అదే చిన్నగంజాం మండలం నీలాయపాలెం పంచాయతీ తెలుగుదేశం పార్టీ ఖాతాలోకి చేరింది. నీలాయపాలెం సర్పంచ్ గా తుమాటి శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటికే చినగంజాం మండల పరిధిలో గొనసపూడి పంచాయతీ సర్పంచ్ గా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు విక్రమ్ దీప్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  దీంతో మండల పరిధిలో రెండు  పంచాయతీలు తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు విజయం సాధించారు.
నీలయపాలెం సర్పంచ్ తోపాటు ఉపసర్పంచ్ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు సొంతం చేసుకున్నారు. నాలుగువార్డులు తెలుగుదేశం పార్టీ ,రెండు వార్డులు వైసిపి అభ్యర్థులు  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సర్పంచ్ గా  ఎన్నికైన   శ్రీనివాస రావు కొమ్మమూరు  కెనాల్ డిసి చైర్మన్ గా పని చేశారు. గ్రామంలో సమస్యలు, రైతు సమస్యలపై పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తి గా శ్రీనివాసరావును ప్రజలు సర్పంచ్ గా ఎన్నుకున్నారు. సర్పంచ్ గా ఎన్నికైన   శ్రీనివాసరావును, వార్డు సభ్యులను ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారు అభినందించారు. గ్రామపంచాయతీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం గ్రామాభివృద్ధి కోసం పాటుపడాలని కోరారు.
తిమిడిత‌పాడులోనూ సైకిల్ ప‌రుగులు :
నియోజ‌క‌వ‌ర్గంలోని కీల‌క‌మైన కారంచేడు మండలం తిమిడితి పాడు పంచాయతీలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిని పూరిమిట్ల సుబ్బులు  సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  తిమిడితపాడులో సర్పంచ్ తో పాటు ఉప సర్పంచ్, 5 వార్డులకు సింగల్ నామినేషన్ లతో  తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు విజయఢంకా మోగించారు. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ వార్డు సభ్యులకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గారు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ సర్వతోముఖాభివృద్ధికి  పాటుపడాలని సూచించారు.
ఏలూరు జోరు.... వైసీపీ బేజారు..
ఏదేమైనా స్థానిక ఎన్నిక‌ల‌కు ముందు నుంచే ఎమ్మెల్యే ఏలూరి తిరుగులేని వ్యూహాల‌తో ముందుకు దూసుకు వెళ్లారు. ఆ మాట‌కు వ‌స్తే గ‌త ఎన్నిక‌ల్ల రాష్ట్రంలో పార్టీ అధికారంలో లేకపోయినా ఆయ‌న మాత్రం నిత్యం ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉన్నారు. ఏలూరి వ్య‌క్తిగ‌త ఇమేజ్‌కు తోడు.. స్థానికంగా పార్టీ కేడ‌ర్ ఐక్యంగా ప‌నిచేయ‌డంతో ప‌రుచూరు ప‌ల్లెపోరులో టీడీపీకి తిరుగులేని విధంగా ఏక‌గ్రీవాలు న‌మోదు అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: