పాఠశాలల విషయంలో సంచలన నిర్ణయం..!

NAGARJUNA NAKKA
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలోని ఇంటర్మీడియట్ కాలేజీలకు వేసవి సెలవులను రద్దు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. అలాగే పదో తరగతి విద్యార్థులకు నేటి నుంచి రెండు పూటలా తరగతులు ప్రారంభమయ్యాయి.  
కరోనా వల్ల ఈ ఏడాది విద్యా వ్యవస్థ తీవ్ర ఇబ్బందులకు గురైంది. విద్యా సంవత్సరాన్ని రద్దు చేస్తే, విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బందికరమని భావించిన ప్రభుత్వాలు ఆ దిశగా ప్రయత్నాలను విరమించుకున్నాయి. ఆన్ లైన్ క్లాసులను ప్రోత్సహించాయి. కరోనా కాస్త నెమ్మదించిన తర్వాత ఇటీవలే స్కూళ్లను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ లోని ఇంటర్మీడియట్ కాలేజీలకు వేసవి సెలవులను రద్దు చేసింది. ఇంటర్‌ ప్రథమ సంవత్సర తరగతులు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఇందుకు సంబంధించి ఇంటర్‌ బోర్డు సవరించిన వార్షిక క్యాలెండర్‌ను ప్రకటించింది. ఆ ప్రకారం 106 పని దినాలు ఉంటాయి. మే 31 వరకూ తరగతులు జరుగుతాయి. రెండో శనివారం కూడా కళాశాలలు నడుస్తాయి. 2021-22 విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జూన్‌ 3 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
పదో తరగతి విద్యార్థులకు నేటి నుంచి రెండు పూటలా తరగతులు ప్రారంభమయ్యాయి. వీరికోసం ప్రత్యేంగా 103 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. రోజుకు 8 పీరియడ్లు నిర్వహిస్తారు. ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4.20గంటల వరకూ తరగతులు జరుగుతాయి.
జాతీయ, ఇతర పండుగలు మినహా ఆదివారాల్లో కూడా తరగతులు నిర్వహిస్తారు. ఆదివారం ఒక పూట ఒక సబ్జెక్టులో తరగతులు జరుగుతాయి. అన్ని పాఠశాలల్లో నేటి నుంచే ఈ ప్రణాళికను అమలు చేయాలని ఆదేశాలు వెలువడ్డాయి. అలాగే ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఆరో తరగతి క్లాసులు కూడా నేటి నుంచే ప్రారంభమయ్యాయి. వీరికి రోజు మరిచి రోజు తరగతులు నిర్వహిస్తారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల నిర్వహణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: