పండుగ రోజే పందెం రాయుళ్లకు భారీ షాకిచ్చిన ఏపీ పోలీసులు

విజయవాడ: సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. పండుగ పేరుతో పందెం రాయుళ్లు యథేచ్చగా కోడి పందేలు నిర్వహిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు కూడా ఏపీలోని అనేక జిల్లాల్లో కోడి పందేల బరులు సిద్దమైపోయాయి. మరోపక్క పోలీసులు మాత్రం ఎక్కడ పందేలు నిర్వహించినా ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయితే అధికార పార్టీ అండతో చాలా మంది పోలీసుల మాటలను లెక్క చేయడం లేదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అధికార పార్టీ అండతోనే పందెం రాయుళ్లు పందేలు నిర్వహిస్తున్నారు. అధికారంలో ఉన్న పెద్దలు కూడా సంక్రాంతి సమయంలో చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు కూడా వస్తూనే ఉన్నాయి. ఇక
ఇదిలా ఉంటే.. కృష్ణాజిల్లాలో ఇప్పటికే అనేక పందెం బరులను పోలీసులు ట్రాక్టర్‌తో దున్నించేశారు. కృష్ణా జిల్లా పరిధిలోని గుడివాడ, మోపిదేవి, నాగాయలంక, బంటుమిల్లి, ముదినేపల్లి, హనుమాన్ జంక్షన్ ఇలా విజయవాడ నగరానికి నలుమూలలా ఇప్పటికే పందెం బరులను పందెం రాయుళ్లు సిద్దం చేశారు. అయితే పండుగ ముగిసేంత వరకు కూడా నిరంతంగా దాడులు నిర్వహిస్తూనే ఉంటామని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్ర నాథ్ బాబు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎక్కడికక్కడ పందెం బరులను గుర్తించి వాటిని ధ్వంసం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు ఒక్క కృష్ణాజిల్లాలో 432 కేసులను నమోదు చేశామని, 732 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు.
 వీరి నుంచి 65 లక్షల 8 వేల రూపాయలను, 2240 కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నామన్నారు. కృష్ణా జిల్లాతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లోనూ కోడి పందేలు యథేచ్చగా సాగుతున్నాయి. పోలీసులు ఎక్కడి కక్కడ పందెం బరులను ధ్వంసం చేస్తున్నామని చెబుతున్నప్పటికి, కొన్ని ప్రాంతాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులే స్వయంగా బరులను ఏర్పాటు చేస్తున్నారు. వీరి జోలికి పోలీసులు కూడా వెళ్లడం లేదని, కేవలం ఏ అండా లేకుండా ఏర్పాటు చేసిన బరులపై మాత్రమే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: