వైరస్ తో ప్రమాదం ఊహించని రీతిలో ఉంటుందా..?

NAGARJUNA NAKKA
వలస పక్షుల నుంచే ఈ వైరస్‌ వచ్చినట్లు అనుమానిస్తున్నారు. అందుకే పాంగ్‌డామ్‌ సరస్సు వైపు పర్యాటకులు వెళ్లకుండా నిషేధించారు. పది కిలోమీటర్ల వరకు నిషేధాజ్ఞలు విధించారు. ఇది మనుషులకు వచ్చే ప్రమాదం ఉండటంతో పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ఈ వైరస్‌ అత్యంత ప్రమాదకరమైందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైరస్‌ వేగంగా విస్తరించగలదని.. దీనిని కట్టడి చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే హిమాచల్‌ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాలో కోళ్లు, పక్షులు, చేపల విక్రయాన్ని నిలిపివేశారు. ఎగుమతులపై కూడా నిషేధం విధించారు. వీటి కారణంగా వైరస్‌ మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు.

వైరస్‌ మనం పెంచుకునే కోళ్లతో పాటు బాతులు, ఇతర పక్షులు, జంతువులకు సోకుతుందని చెబుతున్నారు అధికారులు. వైరస్‌ బారిన పడిన పక్షులు, జంతువుల దగ్గరికి వెళ్లినప్పుడు ముక్కు,  కళ్లు, నోటి ద్వారా ఈ వైరస్‌ మనుషులకు వ్యాపించే ప్రమాదం ఉంది. బర్డ్‌ ఫ్లూ బారిన పడిన పక్షుల లాలాజలం, శ్లేషం, విసర్జనలో వైరస్‌ ఉంటుందని వెటర్నరీ డాక్టర్లు చెబుతున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో మోతాదు కంటే ఎక్కువ వైరస్‌ మనిషి నోరు, ముక్కు, కళ్లలోకి చేరితే బర్డ్‌ ఫ్లూ బారిన పడే ఛాన్స్‌ ఉందని హెచ్చరిస్తున్నారు.  

అందుకే వైరస్‌ సోకిన పక్షులను గుర్తించి.. వెంటనే చంపేస్తున్నారు. ఇప్పటికే ఐకార్‌, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హై సెక్యురిటీ యానిమల్‌ డీసీస్‌ నిర్వహించిన పరీక్షల్లో ఐదు పక్షులకు H5N1 పాజిటివ్‌గా తేలింది. మిగతా వాటి రిపోర్ట్‌ రావాల్సింది..! చూస్తుంటే ఇది పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. పక్షులు చనిపోయిన ప్రాంతానికి ఎవరినీ వెళ్లనివ్వడం లేదు పోలీసులు. ఈ వైరస్‌ మరింత వేగంగా విస్తరించకుండా ఉండేందుకు వాటిని వెంటనే పూడ్చి పెడుతున్నారు. ఇక వైరస్‌ను గుర్తించిన కిలోమీటర్‌ పరిధిలో ఉన్న అన్ని జంతువులను చంపివేయాలని కేరళ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అయితే వైరస్‌ మరిన్ని రాష్ట్రాలకు విస్తరిస్తే దాని వినాశనం ఉహించని రీతిలో ఉంటుందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: