నితీష్ కుర్చీ కిందకు నీళ్ళు తెస్తున్న బీజేపీ ?
ఇవ్వక ఇవ్వక నితీష్ కి అయిదుగురు మంత్రులు ఇచ్చారు. అందులో ఒకరు అవుట్ అన్న మాట. ఇక నితీష్ ఎంతకాలం సీఎం గా ఉంటారు అన్నది బహుశా ఆయనకు కూడా తెలియదు అనుకోవాలి. మధ్యప్రదేశ్ లో కర్నాటకలో జరిగిన దాన్ని బీహార్ లో కూడా అమలు చేయాలని బీజేపీ తాజాగా డిసైడ్ కావడంతో నితీష్ కుర్చీ కిందకు నీళ్ళు వస్తాయా అన్నదే హాట్ హాట్ డిస్కషన్.
ఇంతకీ నితీష్ కుమార్ ప్రభుత్వానికి ఏమైంది మెజారిటీ ఉంది కదా అంటే అది బొటా బొటీ మెజారిటీ. పైగా ఎనిమిది మంది చిన్న పార్టీల సభ్యుల మద్దతుతో ఏర్పడిన సర్కార్ అది. ఎవరికి కోపం వచ్చిన సీటు దిగిపోవాల్సిందే. ఇక మరో వైపు పెద్దన్నగా బీజేపీ ఉంది. ఏ పార్టీకి 74 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక బీజేపీ కూడా రానున్న కాలంలో ప్రభుత్వ సుస్థిరత దెబ్బ తినకుండా ఆపరేషన్ అపొజిషన్ అంటోందిట.
అంటే మరేం లేదు, మధ్యప్రదేశ్ లో 28 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మూకుమ్మడిగా బీజేపీలోకి లాగేసి ఆ తరువాత ఉప ఎన్నికలకు వెళ్ళి అన్నీ గెలుచుకున్నారు. అలాగే కర్నాటకలో బలం చాలకపోతే బీజేపీ కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను లాగేసి ఉప ఎన్నికల్లో గెలిపించుకుంది. ఇపుడు బీహార్ లో అదే చేస్తారట. అందుకు గానూ 19 మంది ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద, అలాగే కుర్ర నాయకుడు తేజస్వి యాదవ్ ఆద్వర్యంలోని ఆర్జేడీ మీద ఇతర చిన్న పార్టీల మీద కూడా బీజేపీ గట్టిగానే వల వేసిందంట. ఈ వలకు కనీసంగా పాతిక మంది ఎమ్మెల్యేలు చిక్కినా వారంతా బీజేపీ పరమవుతారు. ఉప ఎన్నికలకు వెళ్ళి వారిని గెలిపించుకుని వంద సీట్లకు బీజేపీ చేరుకుంటుంది అన్న మాట. ఆ విధంగా ఫ్యూచర్ లో నితీష్ ని పీఠం నుంచి తప్పించి సీఎం సీటు కూడా బీజేపీ పట్టేస్తుంది అంటున్నారు.