ఏపీ పాలిటిక్స్ :యనమలపై మంత్రి దురుసు వ్యాఖ్యలు...
రీసెంటుగా ఏపీలోని రెండు పారిశ్రామిక సంస్థల మధ్య జరిగిన వాటాల విక్రయ లావాదేవీలను ముఖ్యమంత్రి జగన్ కు ముడిపెట్టిన టీడీపీ నేత యనమల రామకృష్ణుడి ని ఉద్దేశించి వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు రాష్ట్రంలో చర్చనీయాంశమయింది. మంత్రి మాట్లాడుతూ ప్రతి చిన్న విషయానికి ప్రభుత్వానికి లింక్ పెట్టడం వీరికి అలవాటయిపోయిందని, యనమలకి చిన్న మెదడు చితికినట్లుందని మాట్లాడేముందు ఆలోచించాలని ఆయనకు కౌంటర్ ఇచ్చారు. ఒక వ్యాపార సంబంధమయిన కాకినాడ సెజ్లో జీఎంఆర్, అరబిందో కంపెనీల మధ్య షేర్ల విక్రయాన్ని రాజకీయం చేయడానికి కూడా ఒక హద్దు ఉండాలని యనమలపై కన్నబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
మంత్రి కన్నబాబు విజయవాడలో విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘ప్రతిపక్షం అంటున్నట్లుగా అరబిందో కంపెనీ రైతుల నుంచి ఎటువంటి భూములను లాక్కోలేదు. జీఎంఆర్ సంస్థ నుంచి మాత్రమే కొనుగోలు చేసింది. మరియు గతంలో జీఎంఆర్ వారు కాకినాడ రైతుల నుంచి భూములను లాక్కున్నప్పుడు టీడీపీనే అధికారంలో ఉంది. మీకు అప్పుడు ఇవి కనపడలేదా? మీ హయాంలోనే ఇదంతా జరిగింది’ అని ఎద్దేవా చేశారు. కాకినాడలో సెజ్కు శ్రీకారం చుట్టి ఇవాళ నీతులు వల్లించడం యనమలకు సిగ్గుగా లేదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కాకినాడ సెజ్ ను ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించారు.. ఒకవేళ కాకినాడ సెజ్ వ్యవహారంలో జీఎంఆర్కే లాభం చేకూర్చాలనుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్కు ఇచ్చిన ఎంతో విలువైన కమర్షియల్ భూముల్లో వేల కోట్ల విలువ చేసే 500 ఎకరాలను ఎందుకు వెనక్కుతీసుకుంటారు? మీకు ఆమాత్రం తెలియదా? కాబట్టి ఒక విషయం గురించి మాట్లాడేటప్పుడు పూర్తి విషయావగాహనతో మాట్లాడితే అందరికీ బాగుంటుంది అని కన్నబాబు ప్రతిపక్ష నాయకులకి వార్నింగ్ ఇచ్చారు.