కరోనాకు వ్యాక్సిన్ అవసరం లేదా..? బయటపడుతున్న షాకింగ్ విషయాలు..!!
ప్రస్తుతం ప్రపంచదేశాలు కరోనా కోరల్లో చిక్కుకుని విలవిలలాడిపోతున్న సంగతి తెలిసిందే. చైనాలో పుట్టుకొచ్చిన ఈ ప్రాణాంతక వైరస్.. అడ్డు అదుపు లేకుండా దేశదేశాలు వ్యాప్తిచెందింది. ఈ క్రమంలోనే అటు ప్రజలను, ఇటు ప్రభుత్వాలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇక ఇప్పటికే కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య అయిదు లక్షల మార్క్ను దాటేసింది. మరియు పాజిటివ్ కేసులు సంఖ్య ఒక కోటి ఆరు లక్షలు మించిపోయింది. ముఖ్యంగా, అమెరికా, బ్రెజిల్, దక్షిణాఫ్రికాలో వైరస్ ఉధృతి భారీ స్థాయిలో ఉంది.
మరోవైపు వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనా ముప్పు తప్పదని నిపుణులు తేల్చి చెప్పారు. దీంతో యావత్ ప్రపంచం వ్యాక్సిన్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే కరోనా వ్యాక్సిన్ కనుగొనే దిశగా ప్రపంచదేశాల శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. అయినప్పటికీ తగిన ఫలితం దక్కడం లేదు. అయితే ఇలాంటి సమయంలో కరోనా గురించి కొత్త విషయాలు బయటపడుతున్నాయి. తాజాగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటి ఫ్రొఫెసర్, ఎపిడెమియాలజిస్ట్ సునేత్రా గుప్తా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మనలో చాలామందికి కరోనా వ్యాక్సిన్ అవసరం ఉండకపోవచ్చని, వైరస్ దానంతట అదే సహజంగా నశించిపోతుందని ఆమె అంటున్నారు. అలాగే రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉన్న వారు కరోనా బారినపడితే త్వరగా కోలుకుంటున్నారని వెల్లడించారు. కరోనాను సాధారణ ఫ్లూ లాగే చూడాలని.. దీనిపై ఎలాంటి ఆందోళన పడవద్దని సూచించారామె. ఇక వృద్ధులు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపైనే కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆమె చెప్పారు. మిగతా వారికి ఒకవేళ సోకినా త్వరగానే కోలుకుంటున్నారని తెలిపారు. అంతేకాకుండా.. స్పానిష్ ఇన్ ఫ్లూయెంజా మాదిరిగానే కరోనా సైతం మన జీవితంలో భాగమవుతుందని సునేత్రా తెలిపారు.