ఇదేందయ్యా ఇది....కటింగ్ తీస్తారట కానీ గడ్డం మాత్రం అలాగే వదిలేస్తారట
దేశవ్యాప్తంగా కరోనా కలకలం కొనసాగుతోంది. ఈ మహమ్మారి బారిన ప్రత్యక్షంగానో..పరోక్షంగానో పడని రంగం అంటూ లేదు. కొన్ని రాష్ట్రాలైతే ఈ మహమ్మారికి తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. అలాంటి వాటిలో దేశ ఆర్థిక రాజధాని ముంబైని కలిగి ఉన్న మహారాష్ట్ర ఒకటి. దేశంలోనే మహారాష్ర్టలో అత్యధికంగా 1,42,899 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 6,739 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా ముంబైలో 69,528, థానేలో 27,880, పుణెలో 17,445, పాల్గర్ లో 4,028, ఔరంగాబాద్ లో 3867 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
లాక్ డౌన్ నిబంధనల సడలింపు సమయంలో అన్ని రాష్ర్టాలో సెలూన్లకు అనుమతి ఇచ్చినప్పటికీ.. కరోనా విజృంభణ దృష్ట్యా మహారాష్ర్టలో అనుమతివ్వలేదు. సుమారు 3 నెలల తర్వాత అక్కడ సెలూన్స్ తెరుచుకుంటున్నాయి. జూన్ 28వ తేదీ నుంచి హెయిర్ సెలూన్స్ దుకాణాల ఓపెన్ కు అనుమతిచ్చారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్. కేవలం హెయిర్ కటింగ్కు మాత్రమే అనుమతిచ్చారు. షేవింగ్స్ చేసేందుకు అనుమతివ్వలేదు. దుకాణ యజమాని, కస్టమర్లు తప్పనిసరిగా మాస్కు ధరించాలని ఆదేశాలు జారీ చేశారు. లేని యెడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. కచ్చితంగా నిబంధనలు పాటించాలని ఆదేశించారు.
ఇదిలాఉండగా, కరోనా విజృంభిస్తున్న క్రమంలో వృద్దులకు ఇంటివద్దే కరోనా పరీక్షలు నిర్వహించాలని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిర్ణయించారు. దీనికోసం సుమారు లక్ష కరోనా టెస్టు కిట్లను కేటాయించారు. వీటి ద్వారా చేసిన కరోనా పరీక్షల ఫలితాలు అరగంటలోనే వస్తాయి. మిషన్ యూనివర్సల్ టెస్టింగ్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. 70 ఏండ్లు దాటిన వృద్ధులు డాక్టర్ ప్రిస్కిప్షన్ కూడా లేకుండా ఇంటి వద్దే కరోనా టెస్టులు చేయించుకోవచ్చని చెప్పారు. అలాగే 35 ప్రధాన ప్రైవేటు ఆస్పత్రులను కూడా కొవిడ్-19 యాంటీజెన్ కిట్లు ఉపయోగించాల్సిందిగా కోరినట్లు సమాచారం.