కరోనా ఎఫెక్ట్.. మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటన వాయిదా!
వరంగల్ జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తుంది. తాజాగా వరంగల్ లో 6 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. ఎంజీఎం ఆస్పత్రిలో ఆరుగురికి కరోనా పాజిటీవ్ వచ్చినట్లు వైద్యాధికారులు నిర్దారించారు. వరంగల్ నగరంలో ఐదుగురికి కరోనా సోకగా..జనగామ లో ఒకరికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. బ్రాహ్మణ వాడకు చెందిన ఇద్దరు మహిళలకు, కాజీపేట విష్ణుపురికి చెందిన ఇద్దరికి, రాంనగర్ కు చెందిన మరో వ్యక్తికి, జనగామలో మరో పాజిటివ్ కేసు నమోదైనట్లు నోడల్ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఆసుపత్రిలో చేరిన 13 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా 6గురికి పాజిటీవ్ రిపోర్టు వచ్చినట్లు వైద్యులు తెలిపారు.
ఇందులో ఈ నెల 6న బ్రాహ్మణవాడలో ఓ టీచర్కు కరోనా పాజిటీవ్ రాగా, అతని భార్య, కూతురికి కరోనా నిర్దారణ అయినట్లు తెలిపారు. కాజీపేట విష్ణుపురికి చెందిన భార్యాభర్తలిద్దరికీ పాజిటీవ్ రాగా, వారు వారం రోజులు హైదరాబాద్లో ఉండి ఆదివారం వరంగల్ ఎంజీఎంలో చేరారు. జనగామ జిల్లాకు చెందిన 37ఏళ్ల మహిళలకు పాజిటీవ్ రాగా, ఎమ్మెల్యే గన్మెన్కు రెండో సారి నిర్వహించిన పరీక్షలో పాజిటీవ్ వచ్చినట్లు తెలిపారు. ఈ ఘటనతో వైద్య సిబ్బందిలో ఆందోళన నెలకొంది.
ఈ నేపథ్యంలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ రేపటి వరంగల్ పర్యటన వాయిదా పడింది. ఈ విషయాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ వెల్లడించారు. బుధవారం మంత్రి కేటీఆర్ వరంగల్ జిల్లాలో పర్యటించాల్సి ఉంది. ఖాజీపేటలోని కడిపికొండ జంక్షన్ వద్ద మడికొండ వాసులకు చెందిన 200 డబుల్ బెడ్రూం ఇళ్లు, ఖాజీపేటలో స్థానికుల కోసం నిర్మించబోయే 97 డబుల్ బెడ్రూం ఇళ్లకు శంకుస్థాపన చేయాల్సి ఉంది. ప్రస్తుతం వరంగల్ పరిస్థితి బాగాలేనందున వాయిదా పడ్డట్టు సమాచారం.