తిరుమల సాంస్కృతిక అభివృద్దిలో మరో ముందడుగు... ఇంతకి ఏంటో తెలుసా..?
తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధి చర్యల్లో భాగంగా ఏపీ ప్రభుత్వ కేబినేట్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తెలుగు భాష, సంస్కృతిని అకాడమీతో కలిపి తెలుగు సంస్కృత అకాడమీ పేరిట రాష్ట్రస్థాయి సంస్థను తిరుపతిలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు గురువారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశంలో సూత్రప్రాయంగా నిర్ణయించారు. అంతా అనుకున్నట్లుగా జరిగితే సాధ్యమైనంత త్వరలోనే తిరుమలలో తెలుగు అకాడమీ ఏర్పాటు జరిగిపోనుంది. వాస్తవానికి ఏపీ, తెలంగాణాలో సుమారు 9 కోట్ల మందికి తెలుగు మాతృభాషగా ఉంది.
తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధి, తెలుగు భాషలో పాఠ్యాంశాల తయారీ, ప్రచురణ, తెలుగు సాహిత్యంపై అవగాహన పెంపొందించడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగు అకాడమీ ఏర్పాటు చేశారు. దీని ద్వారా అనేక పాఠ్యపుస్తకాలను ముద్రించి అందరికీ అందేలా చూశారు. యూనివర్సిటీలు, కళాశాలల్లో సదస్సులు, సెమినార్లు నిర్వహించేవారు. ఈ అకాడమీ ద్వారా డిగ్రీ స్థాయి వరకు అనేక ప్రామాణిక పుస్తకాలు తీసుకురావడం వల్ల ఎంతో ఉపయుక్తంగా మారింది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయాక తెలుగు అకాడమీ ఇంకా విడిపోలేదు. రెండు రాష్ట్రాలకు సంయుక్తంగా ఉంది. సుమారు 400 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఏపీకి దాదాపు 58 శాతం నిధులు రావాల్సి ఉంది.
ఉమ్మడి రాష్ట్రం విడిపోయాక తెలుగు అకాడమీ విభజనపై అప్పటి టీడీపీ ప్రభుత్వం 2014–2019 వరకు అధికారంలో కొనసాగినా దీనిని పట్టించుకోలేదు. అయితే ఇప్పుడు తెలుగు సంస్కృత అకాడమీని తిరుపతిలో ఏర్పాటు చేయాలని సూత్రప్రాయ నిర్ణయం తీసుకోవడంపై జగన్మోహన్రెడ్డి ప్రభుతవ్ం సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఆధ్యాత్మిక నగరంగానే కాకుండా సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమైన తిరుపతిలో తెలుగు సంస్కృత అకాడమీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఆనందదాయకమని తిరులమవాసులు పేర్కొంటున్నారు. తెలుగు అకాడమీ తిరుమలలో ఏర్పాటు చేయడం అనేది సముచితమైన నిర్ణయమని భాషా పండితులు పేర్కొంటున్నారు.