టీడీపీ అధ్యక్షుడ్ని మార్చే ఆలోచనలో చంద్రబాబు..!
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు బలపడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అనేది వాస్తవం. చంద్రబాబు నాయుడు పార్టీని ఏ విధంగా బలోపేతం చెయ్యాలి అని చూసినా సారే సిఎం వైఎస్ జగన్ ని తట్టుకుని నిలబడట౦ పార్టీకి ఇబ్బందిగా మారింది. జగన్ వేస్తోన్న ఎత్తులు ముందు చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయం ఎందుకు కొరగాకుండా పోతోంది. ఈ తరుణంలో ఆయన కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
చంద్రబాబు ఇప్పుడు పార్టీ అధ్యక్షుడి విషయంలో కీలక నిర్ణయం తీసుకునే సూచనలు కనపడుతున్నాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడి గా గల్లా జయదేవ్ ని నియమించే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. అలాగే రాష్ట్ర అధ్యక్షుడిగా రామ్మోహన్ నాయుడు ని నియమించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలే అంటున్నాయి. ఇటీవల జరిగిన మహానాడు లో దీనిపై కొందరు నేతల అభిప్రాయం చంద్రబాబు అడిగారు. ఈ క్రమంలోనే పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న నేపథ్యంలో ఓడిపోయిన కళా వెంకట్రావును అధ్యక్షుడిగా కొనసాగించడంలో అర్థం లేదని కొందరు బాబుకు చెప్పారట.
ఇక యువ నాయకత్వం నేపథ్యంలో రామ్మోహన్ నాయుడి పేరు ఎక్కువ మంది సూచించారని అంటున్నారు. ఇక గుంటూరు ఎంపీ గల్లాకు జాతీయ స్థాయిలో గుర్తి౦పు ఉంది. ఇప్పుడు ఆయన పార్టీ అధ్యక్షుడు అయితే అటు బిజెపి నుంచి కూడా తనకు సహకారం అందే అవకాశం ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. గల్లాకు కేంద్ర మంత్రుల తో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కూడా గల్లాకు మంచి క్రేజ్ యూత్ లో ఉంది. అందుకే గల్లాకు పార్టీ లో కీలక బాధ్యతలు అప్పగించే విధంగా అడుగులు వేస్తున్నారు అని సమాచారం.