కరోనాకు వర్షం తోడైతే... పరిస్థితి ఏంటో తెలుసా.. ?
హైదరాబాద్ ప్రజలకు వానాకాలం వస్తోందంటే వణుకు పుట్టుకొస్తోంది. రోడ్లపై వరదనీరు నిలిచిపోవడం, ఎడతెగని ట్రాఫిక్ జామ్లు, విజృంభించే సీజనల్ వ్యాధులు.. ఇలా చెప్పుకుంటే పోతే పెద్ద జాబితా తయారవుతుంది. ఈసారి వీటికి కరోనా కూడా తోడైంది. ఇప్పటికే చెలరేగిపోతున్న కరోనా.. వానాకాలంలో పీక్ స్టేజ్ కు చేరుతుందనే అంచనాలు హైదరాబాదీలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.
హైదరాబాద్ లో వానాకాలంలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తాయి. ఈసారి వీటికి కరోనా తోడవుతుందనే ఆందోళన ఉంది. దీనికి తోడు రోడ్ల మీద ఎక్కడపడితే అక్కడ నిలిచే నీళ్లు కారణంగా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. వర్షాకాలంలో శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది కాబట్టి.. కరోనా ఎటాక్ పెరుగుతుందనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. మరి వీటన్నింటినీ తట్టుకుని గ్లోబల్ సిటీ హైదరాబాద్ కరోనాతో ఫైట్ చేయడానికి రెడీగా ఉండాల్సిన తరుణమిది.
కరోనా కేసులు హైదరాబాద్ ను టెన్షన్ పెడుతుండగా, రానున్న వానాకాలం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. చినుకులకే చెరువులను తలపించే సిటీలో సీజనల్ డిసీజెస్ను సవాల్గా తీసుకొని జీహెచ్ఎంసీ యాక్షన్ ప్లాన్ రెడీ చేసింది. ఇప్పటికే ఎంటమాలజీ వింగ్ను అలర్ట్ చేసింది. మాన్సూన్ ప్లాన్ రూపొందించింది. గ్రేటర్ అంతటా శానిటేషన్, డిసీజెస్ కట్టడికి చర్యలు తీసుకుంటూనే.. కరోనా ఎఫెక్టెడ్ ఏరియాలు, కంటెయిన్మెంట్ జోన్లపై స్పెషల్ ఫోకస్ పెట్టనున్నట్టు బల్దియా వర్గాలు తెలిపాయి.
ఏటా వానాకాలంలో సీజనల్ డిసీజెస్ నివారణకు జీహెచ్ఎంసీ మాన్సూన్ ప్లాన్ అమలు చేస్తుంది. ఈసారి కరోనా రావడం, కేసులు పెరుగుతుండడంతో రాబోయే పరిణామాలను ఎదుర్కొనేందుకు మరింత అప్రమత్తం అయింది. సిటీలో ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదైన తరుణంలో.. ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉందని ఎంటమాలజీ వింగ్కు బల్దియా ఉన్నతాధికారులు గైడ్లైన్స్ ఇచ్చారు. వైరస్ ఎఫెక్టెడ్ ఏరియాల్లో శానిటేషన్, డిస్ఇన్ఫెక్టివ్ స్ప్రే చేస్తున్న జీహెచ్ఎంసీ టీమ్లకు వానాకాలం సవాల్గా మారనుంది. కరోనా సోకిన వ్యక్తి ఇంటితోపాటు చుట్టుపక్కల 50 ఇళ్లను కవర్ చేస్తూ డైలీ రెండు సార్లు స్ప్రే, ఫాగింగ్ చేయనున్నాయి. దోమల వ్యాప్తిని అడ్డుకునేందుకు యాంటీ లార్వా ఆపరేషన్ అమలు చేస్తాయి. రెండు మూడు రోజుల్లో మూసీ నది, ఓపెన్ నాలాల్లో డ్రోన్ ఆపరేషన్ చేపట్టనున్నట్టు ఎంటమాలజీ వర్గాలు తెలిపాయి.
గ్రేటర్లో పెద్ద సంఖ్యలో స్పెషల్ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని బల్దియా భావిస్తోంది. సీజనల్ డిసీజెస్ నివారణకు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల మెడికల్ ఆఫీసర్లతో కో ఆర్డినేట్ చేసుకునేలా ప్లాన్ చేస్తోంది. గతేడాది మాన్సూన్లో 600 మెడికల్ క్యాంపులు నిర్వహించారు. ఈసారి 800 వరకు పెట్టనున్నట్టు తెలుస్తోంది.
శానిటేషన్పై జనాల్లో అవేర్నెస్ పెంచేందుకు కూడా జీహెచ్ఎంసీ చర్యలు తీసుకోనుంది. దోమలు పెరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కాలనీలు, బస్తీల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడంతోపాటు కరోనాపైనా అవేర్నెస్ కల్పించనుంది. అందుకోసం 6 జోన్లలో 650 ఎంటమాలజీ టీమ్లతోపాటు ఎస్హెచ్జీలను భాగస్వామ్యం చేయనుంది. స్థానిక రాజకీయ నేతలనూ కలుపుకొని పోనుంది. విద్యాసంస్థలు ప్రారంభమైతే.. ఎలాంటి చర్యలు చేపట్టాలో కూడా గైడ్ లైన్స్ రెడీ చేసింది జీహెచ్ఎంసీ.