వ్యక్తి నుంచి వ్యక్తికి మాత్రమే కరోనా.. బయటపడ్డ కొత్త విషయాలు..!!
ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా మయమైపోయింది. ఎక్కడ చూసినా కరోనా భయమే కనిపిస్తోంది. కరోనా అంటేనే ప్రజలు ఆమడదూరం పారిపోతున్నారు. గతేడాది డిసెంబరులో చైనాలోని వుహాన్ నగరంలో వెలుగుచూసిన కొత్తరకం కరోనా వైరస్.. అనాతి కాలంలో ప్రపంచ మొత్తం వ్యాప్తిచెందింది. ఈ క్రమంలోనే లక్షల మందిని బలితీసుకుంది. అయినప్పటికీ దీని దాహం తీరడం లేదు. ప్రస్తుతం కరోనా వైరస్ మానవ మనుగడకే సవాల్ విసురుతోంది. ఇక కరోనాకు వ్యాక్సిన్ లేకపోవడంతో ప్రభుత్వాలకు పెద్ద సవాల్గా మారింది. అలాగే ఈ వైరస్ దెబ్బకు ప్రపంచమంతా లాక్డౌన్ లో ఉండిపోయింది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు.
అయితే ఇలాంటి సమయంలో కరోనా గురించి కొత్త కొత్త విషయాలు బయట పడుతున్నాయి. ఇదిలా ఉంటే.. కరోనా సోకిన వ్యక్తి తాకిన వస్తువులను తాకితే.. వారికి కూడా కరోనా వస్తుంది అని ఇప్పటి వరకు ప్రచారం జరిగింది. అయితే ఇవి కేవలం వదంతులే అని అంటుంది అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ). వస్తువులు లేదా పేపర్ మరేదైనా ముట్టుకుంటే కరోనా సోకినట్లు ఇప్పటిదాకా ఎలాంటి ఆధారాలు లభించలేదని సీడీసీ ఆధ్యయనంలో తేలింది. స్పష్టంగా చెప్పాలంటే కరోనా పాజిటివ్ వ్యక్తితో నేరుగా కలవడం, వారి ద్వారా వచ్చిన ఇతరులను కలవడం, వారి పక్కనే ఉండటం వల్ల వైరస్ సోకుతుందని తెలిపింది.
అంతే తప్ప పాజిటివ్ వ్యక్తి పట్టుకున్న వస్తువులను, ఉపరితలాలను తాకడం వల్ల కరోనా వచ్చినట్లు స్పష్టమైన ఆధారాలు దొరకలేదని సీడీసీ తేల్చిచెప్పింది. అలాగని వస్తువులు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం మానేయొద్దని, దానికి అంత ప్రాధాన్యం ఇవ్వొద్దని మాత్రమే పేర్కొంది. కరోనా వైరస్ వ్యక్తి నుంచి వ్యక్తికి మాత్రమే సోకుతుందని స్పష్టం చేసింది. కాగా, మార్చిలో ఇదే సంస్థ విడుదల చేసిన నివేదికలో.. పరిసరాలను తాకడం వల్ల రావొచ్చని పేర్కొనడం గమనార్హం. ఏదేమైనప్పటికీ.. ప్రపంచ ఆరోగ్య సంస్థతో సమాన ప్రతిష్ట కలిగిన ఈ సంస్థ తాజాగా నిర్వహించిన అధ్యయన నివేదిక ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.