కరోనా వ్యాక్సిన్ వస్తోంది.. ధర తక్కువే..!
కరోనా వైరస్కు మందును కనిపెట్టేందుకు అనేక దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. పరిశోధకులు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. అయితే.. వ్యాక్సిన్ రావడానికి ఇంకా సుమారు 12 నుంచి 18నెలల సమయంపడుతుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఈక్రమంలో అందరి దృష్టి ఇప్పుడు యూకేపైనే ఉంది. యూకేలో ఆక్సఫర్డ్ వర్సిటీ చేస్తున్న పరిశోధన మీదే ఉంది. మందుల తయారీ కంపెనీ అస్ట్రాజెనెకాతో కలిసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో జెన్నర్ ఇనిస్టిట్యూట్ రూపొందిస్తున్న ChAdOx1 nCoV-19 అనే ఈ వ్యాక్సిన్ కోతులపై సానుకూల ఫలితాలు వచ్చాయి. ఈ వ్యాక్సిన్ ప్రయోగాలు విజయవంతమైతే ప్రపంచదేశాలన్నింటికీ అందుబాటులోకి తెస్తామని పరిశోధనల్లో పాల్గొంటున్న ఆక్స్ఫర్డ్ జెన్నర్ ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ అడ్రియాన్ హిల్ చెప్పారు. మనుషులపై ప్రయోగాలు సక్సెస్ అయితే వ్యాక్సిన్ ధర ఎంతవరకు ఉంటుందన్న సందేహాలపై ఒక వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హిల్ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. అతి తక్కువ ధరలో ప్రజలకు వ్యాక్సిన్ అందించడమే తమ లక్ష్యమని అంటున్నారు.
*ఈ వ్యాక్సిన్ ఒక్క డోసు చాలు. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ప్రజలకు ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేలా వివిధ ప్రాంతాల్లో ల్యాబ్లలో దీన్ని రూపొందిస్తాం* అని హిల్ చెప్పారు. డిమాండ్కు తగ్గట్టుగా సప్లయ్ ఉండడం కోసం ఈ వ్యాక్సిన్ను ప్రపంచవ్యాప్తంగా ఏడు ఇనిస్టిట్యూట్లలో తయారు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో భారత్లోని పుణేలో ఉన్న సీరమ్ ఇనిస్టిట్యూట్ కూడా ఉంది. యూరప్, చైనాలో వివిధ ఇనిస్టిట్యూట్లలో ఈ వ్యాక్సిన్ను తయారు చేస్తారు. జూలై, ఆగస్టునాటికల్లా మానవులపై ఈ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుందో తేలిపోతుందని హిల్ వివరించారు. ఇదిలా ఉండగా.. కరోనా వైరస్ లక్షణాలు మనిషిలో బయటపడక ముందే ప్రత్యేకంగా శిక్షణనిచ్చిన కొవిడ్ జాగిలాలు వారిని గుర్తించగలవేమోనన్న దిశగా యూకే ప్రభుత్వం పరిశోధనలు ప్రారంభించింది. కోవిడ్ రోగి నుంచి శాంపిల్స్, కోవిడ్ లేని వారి నుంచి శాంపిల్స్ సేకరించి వాటిని ఆ జాగిలాల దగ్గర ఉంచి వాసన ద్వారా పసిగట్టేలా జాగిలాలకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం జరుగుతోంది. ఈ శిక్షణకు యూకే భారీమొత్తంలో ఖర్చు చేస్తోంది. గంటకు సుమారు 200మందికి జాగిలాలు పసిగట్టవలని పరిశోధకులు చెబుతున్నారు.