ఛీ..ఛీ.. మరీ ఇంత దారుణమా..భారత్పై పాక్ దుర్మార్గపు కుట్ర
ఓ వైపు ప్రపంచదేశాలతోపాటు భారత్ కరోనా మహమ్మారిపై పోరు చేస్తుంటే... పొరుగున ఉన్న పాకిస్థాన్ మాత్రం తన పాడు బుద్ధిని పోనిచ్చుకోవడం లేదు. కొన్నాళ్లుగా జమ్మూకశ్మీర్ లోకి ఉగ్రవాదులను పంపిస్తూ కాల్పులు విరమణ ఒప్పందాలను పదే పదే ఉల్లంఘిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆ దేశాన్ని చీకొట్టిన పట్టించుకోవడం లేదు. ఇప్పటివరకు ఉగ్రవాదులతో మనదేశంపై కుట్రలు చేసిన పాకిస్థాన్ ఇప్పుడు మరో దుర్మార్గానికి పాల్పడుతోంది. మన దేశానికి కరోనా రోగులను పాక్ ఎగుమతి చేస్తోంది. జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్ బాగ్ సింగ్ ఈ సంచలన విషయాన్ని వెల్లడించారు.
కశ్మీర్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఇవాళ జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్ బాగ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ..కశ్మీర్ వాసులకు కరోనా వ్యాప్తి చేసేందుకు పాకిస్థాన్ ఉద్దేశపూర్వకంగా కరోనా రోగులను ఇక్కడికి పంపిస్తుందని ఆరోపించారు. ఇది ఆందోళన కలిగించే విషయం..ముందు జాగ్రత్తలు తీసుకునే అవసరం ఎంతైనా ఉందని డీజీపీ అభిప్రాయపడ్డారు. పాక్ గతంలో ఉగ్రవాదులను ఎగుమతి చేసిన దానికి కొనసాగింపుగా ఇపుడు కరోనా రోగులను కూడా ఎగుమతి చేస్తుందని అన్నారు. పాకిస్థాన్ లో గత 24 గంటల్లో కరోనా బారిన పడి 17 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 209కి చేరుకుంది. మొత్తం 9749 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇదిలాఉండగా, పాకిస్థాన్కు చెందిన మరో దుర్మార్గం బయటపడింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ సమీపంలోని బాగ్ పట్టణంలో సెక్స్ రాకెట్ నడుపుతున్న పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ జమాత్ ఉల్ దవ(జేయూడీ) టాప్ నాయకుడు సయీద్ సమీర్ బుకారీని పోలీసులు అరెస్ట్ చేశారు. కశ్మీర్ ప్రజలను రక్షించేవాళ్లుగా జేయూడీ చెప్పుకుంటూ సెక్స్, డ్రగ్స్ రాకెట్కు పాల్పడుతోంది. జేయూడీ చీఫ్ హఫీజ్ సయీద్కు బుకారీ కీలక అనుచరుడిగా కొనసాగుతున్నాడు. భారత్ వ్యతిరేక కార్యకలాపాల్లో చురుగ్గా పాలుపంచుకుంటాడు. బుకారీ అల్ మఫీజ్ ఫౌండేషన్ను నడిపిస్తున్నాడు. తన కార్యాలయానికి వచ్చిన ఓ మహిళను ఒప్పించేందుకు బుకారీ ప్రయత్నిస్తున్న వీడియో వైరల్ అయింది. బుకారీ బ్లడ్ బ్యాంక్ పేరుతో సెక్స్ రాకెట్ నడిపిస్తున్నట్లుగా సమాచారం.