మైక్రోసాఫ్ట్ సీఈఓకు మోదీ షాక్... తేడాలు వచ్చేశాయి మరి
మైక్రోసాఫ్ట్ సీఈవో, భారత సంతతికి దిగ్గజం, తెలుగు బిడ్డ సత్య నాదెళ్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఊహించని షాక్ తగిలే అవకాశం కన్పిస్తోంది. అంతర్జాతీయ టెక్ దిగ్గజం రథసారథిగా ఎంపికైన ఆయన వివాదాస్పద అంశంలో వ్యవహరించిన తీరుతో మోదీ గుర్రుగా ఉన్నారని సమాచారం. పౌరసత్వ సవరణ బిల్లుపై నాదెళ్ల ఆందోళన వ్యక్తం చేసిన విష యం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన భారత పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రధాని మోదీని కలిసేందుకూ నాదెళ్ల అపాయింట్మెంట్ కోరారు. కానీ, ఇంతవరకూ పీఎంవో దీనిపై స్పందించలేదని తెలుస్తోంది.
సత్య నాదెళ్ల ఈ నెలాఖర్లో భారత్లో పర్యటించనున్నారు. ఈ నెల 24-26 మధ్య నాదెళ్ల భారత పర్యటన ఉండొచ్చని సమాచారం. ఢిల్లీ, ముంబై, బెంగళూరు నగరాల్లో ఆయన పర్యటిస్తారని తెలుస్తోంది. ఈ సందర్భంగా పరిశ్రమ పెద్దలు, ఆయా ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఆయన సమావేశం కానున్నారని సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. కస్టమర్లు, యువ ఔత్సాహిక వ్యాపార, పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, డెవలపర్లనుద్దేశించి మాట్లాడుతారని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఏయే తేదీల్లో నాదెళ్ల భారత పర్యటన ఉంటుంది?.. ఏ నగరాల్లో ఆయన పర్యటిస్తారు? అన్న వివరాలు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)పై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల ఇటీవల చేసిన ప్రతికూల వ్యాఖ్యలు బీజేపీ ఆగ్రహానికి గురయ్యారు. ఆ తర్వాత మైక్రోసాఫ్ట్ దానిపై వివరణ ఇచ్చింది. సరిహద్దులను నిర్వచించుకుని, భద్రతకు సంబంధించిన నిర్ణయాలను ప్రభుత్వాలు తీసుకోవచ్చంటూ నాదెళ్ల తన వ్యాఖ్యలను సవరించుకున్నారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. తాజాగా ఆయన టూర్ నేపథ్యంలో బీజేపీ పరోక్షంగా కౌంటర్ ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలాఉండగా, ప్రధాని మోదీ ఆహ్వానంపై అమెరికా ట్రంప్ ఈ నెల 24, 25 తేదీల్లో భారత్లో పర్యటించనున్న సంగతి తెలిసిందే. భారత్-అమెరికా ఒక వాణిజ్య ఒప్పందం చేసుకొనే అవకాశం ఉంది.