మొరగడం ఆపండి... దమ్ముంటే చాలెంజ్ స్వీకరించండి... జీవీఎల్ ఘాటు కౌంటర్
``ఏపీ సీఎం జగన్ను బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఏకాంతంగా కలిశారు. ఇటీవల ఢిల్లీలోని లోథి హోటల్లో వైసీపీ ముఖ్య నేతను జీవీఎల్ ఎందుకు కలిశారు?మూడు రాజధానులపై జీవీఎల్ కారుకూతలు కూయడం మానుకోవాలి` అంటూ టీడీపీ నేత వర్ల రామయ్య బీజేపీ ఎంపీపై విరుచుకుపడ్డారు. దీనికి ఎంపీ జీవీఎల్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొరగటం మానండి... ఛాలెంజ్ ను స్వీకరించండి అంటూ జీవీఎల్ ఓపెన్ సవాల్ విసిరారు.
ఈరోజు ప్రెస్ మీట్లో వర్ల రామయ్య చేసిన వ్యాఖ్యలకు నా కౌంటర్ ఇది అంటూ జీవీఎల్ స్పందించారు .``వర్ల రామయ్య... నేను మీడియాలో చేసిన ఛాలెంజ్కు స్పందించి దమ్ముంటే సమాధానం చెప్పండి. "ఒక కప్పు కాఫీ, ఒక గ్లాస్ నీళ్ల" కంటే చూపమంటే గాలి కబుర్లు చెబుతారా? ఇదిగో నా ఛాలెంజ్!
#TV9Telugu చర్చలో "ఒక కప్పు కాఫీ, ఒక గ్లాస్ నీళ్ల" కంటే ఏవైనా తీసుకున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానన్నాను. ప్రభుత్వం నుంచి కానీ, పాలక పక్షం నుంచి కానీ, వారి వ్యక్తుల నుంచి కానీ, మరెవరి నుంచైనా కాని - ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ రూపంలో నైనా లబ్ది పొందినట్లు ఆధారాలు చూపిస్తే రాజీనామాకు సిద్ధం.`` అని సవాల్ విసిరారు.
మీ కక్కుర్తి బాగోతాలు నాకు అంటగట్టాలని చూస్తే ఊరుకునేది లేదు అంటూ ఘాటుగా జీవీఎల్ స్పందించారు. ``నా లైఫ్ లో నేను ఢిల్లీలోని లోథి హోటల్కు వెళ్లలేదు? నేను కాదంటే ఎదో ఆధారాలు చూపిస్తానని సొల్లు మాట్లాడారు కదా. జరా చూపించరాదు. ఎవరిని చూసినా మీకు నేనే కనిపిస్తున్నానా? ఇది భ్రమా, భయమా లేక భయంతో కూడిన భ్రమా? గతంలో మీరు నాకు 200 కోట్లు ఉన్నాయని అవాస్తవాలు చెప్పి ఒక్క వివరాన్ని అయినా చూపించమంటే తోక ముడిచారు. ఒకసారి అసత్యాలు చెప్పి దొరికిపోయి, పారిపోయిన మీరు మరలా ఇదే తరహాలో ఉమ్మేసి, పారిపోయే రాజకీయాలు చేస్తారా? మీకు సిగ్గని పించటం లేదా?`` అంటూ జీవీఎల్ దిమ్మతిరిగే స్పందన ఇచ్చారు.