మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు... ఇప్పుడెందుకు జరుగుతుందో తెలుసా?
సామాన్యుడికి మరో షాక్. ధరల పెరుగుదలతో నిత్యావసర వస్తువుల సరుకులు పైకి ఎగబాకుతున్నాయి. ఇప్పటికే ఉల్లి, ఆలు, పప్పుదినుసుల ధరలు ఆకాశాన్నంటుతుండగా.. చమురు ధరల పెంపుతో అవి మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది సామాన్య ప్రజానీకంపై తీవ్ర భారాన్ని మోపుతోంది. పెద్ద ఎత్తున పెరిగి...కొన్నాళ్లు స్తబ్ధుగా ఉన్న ఇంధన ధరలు.. తాజాగా మళ్లీ పైకి ఎగబాకుతున్నాయి. గతనెలలో దేశరాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటరుకు రూ. 72.60గా ఉండేది. నవంబర్ 30 నాటికి ఈ ధర రూ. 74.86కు పెరిగింది. ఇక గతనెల చివరినాటికి రూ. 65.87గా ఉన్న డీజిల్ ధర.. శుక్రవారం నాడు రూ. 67.24గా నమోదైంది. అయితే, పెట్రోల్ , డీజిల్ ధరల పెరుగుదల వెనుక కారణ అంతర్జాతీయ అంశాలు కాదని...రాజకీయ సంబంధమైన కారణాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.
జార్ఖండ్ ఎన్నికల నేపథ్యంలో కొన్నాళ్లు స్తబ్ధుగా ఉన్న ఇంధన ధరలు.. తాజాగా మళ్లీ పైకి ఎగబాకుతున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. జార్ఖండ్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో ఇంధన ధరల్లో పెరుగుదల నెమ్మదించినా.. ఈనెల 23న ఫలితాలు విడుదలవగానే మళ్లీ పెరుగుతున్నాయని అంటున్నారు. జార్ఖండ్ ఎన్నికల ఫలితాల వెలువడిన మరుసటి రోజు నుంచే పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో వరుసగా రెండోరోజూ చమురు ధరలు పెరిగాయి. తాజాగా లీటరు పెట్రోల్పై రూ.0.6 పైసలు, డీజిల్ పై రూ.0.16 పైసలను పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వివరాల ప్రకారం.. శుక్రవారం దేశరాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.74.74లుగా నమోదవ్వగా డీజిల్ ధర రూ.67.09 నుంచి రూ.67.24 కు చేరింది. ముంబయిలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తున్నది. లీటరు పెట్రోలు ధర రూ. 80.40కు చేరగా, డీజిల్ ధర రూ. 70.55గా నమోదైంది. అలాగే హైదరాబాద్లో ఇవే ధరలు రూ.79.53, రూ.73.37గా నమోదయ్యాయి.
నెలరోజుల వ్యవధిలోనే లీటరు పెట్రోలు ధర రూ. 2కు పైగా పెరగడం గమనార్హం. మరోవైపు డీజిల్ సైతం ఇదే స్థితిలో పెరుగుతున్నది. గతనెల చివరినాటికి రూ. 65.87గా ఉన్న డీజిల్ ధర.. శుక్రవారం నాడు రూ. 67.24గా నమోదైంది. ఎన్నికల ఫలితాలు వెలువడి అనంతరం జరుగుతున్న ఈ పరిణామంతో సహజంగానే....కేంద్రం సిగ్నల్స్ మేరకే సంస్థలు నిర్ణయం తీసుకుంటున్నాయా? అనే సందేహాలు రాజకీయ పక్షాల నుంచి వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో...ఇప్పటికే నిత్యావసర ధరలు సామాన్యులకు షాక్లు ఇస్తుండగా...ఇలా పెట్రోల్, డీజిల్ ఓ రేంజ్లో పెరిగిపోవడం పట్ల కలవరం మొదలవుతోంది.