గోదావరి నీళ్లొచ్చేలా.. కాళేశ్వరం ప్రాజెక్టు
కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటి కాదు. ఇది కొన్ని బ్యారేజీలు, పంపు హౌజులు, కాలువలు, సొరంగాల సమాహారం. కానీ, అన్నీ ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నవే. గోదావరి నీటిని వీలైనంత ఎక్కువగా వినియోగించుకోవడానికి వీలుగా ఈ ప్రాజెక్టును రూపొందించారు. ఇటీవల ప్రగతిభవన్ లో సీఎం ఓఎస్డీ (నీటిపారుదల శాఖ) శ్రీధర్ రావు దేశ్ పాండే రాసిన కాళేశ్వరం ప్రాజెక్టు – తెలంగాణ ప్రగతి రథం పుస్తకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ పుస్తకా విష్కరణ కార్యక్రమంలో కవి, రచయిత జూలూరి గౌరీశంకర్, కాళేశ్వరం ఈ.ఎన్.సి. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర సమాచారాన్ని, చరిత్రను అందించాలన్న సంకల్పంతోనే సమగ్ర గ్రంథాన్ని రాశారని రచయిత దేశ్ పాండేను అభినందించారు. వాస్తవానికి కొత్త ఆయకట్టు కాకుండా శ్రీరాంసాగర్, నిజాం సాగర్, మిడ్ మానేరు, లోయర్ మానేరు, అప్పర్ మానేరు ప్రాజెక్టులను కూడా ఈ ప్రాజెక్టుతో అనుసంధానించడానికి కొత్తగా కాలువలు, సొరంగాలు, పంపు హౌజులు తవ్వారు. వీటి ద్వారా మిగిలిన నీటిని తరలించి ఆయకట్టును స్థిరీకరిస్తారు. అంటే ఆ రిజర్వాయర్ల కింద ఉన్న 18.82 లక్షల ఎకరాల ఆయకట్టుకు నికరంగా నీరందించవచ్చని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. వీటికి అదనంగా, పాత ప్రాణహిత ప్రాజెక్టు ప్రతిపాదించిన చోటే అప్పటికంటే ఎత్తు తగ్గించి మరో బ్యారేజీ నిర్మిస్తున్నారు. అసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో 2 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా దీన్ని రీడిజైన్ చేశారు.