సైకో కిల్లర్ పని అయిపోయినట్టేనా..!
హాజీపూర్ సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డి కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ త్వరలోనే ముగియనుంది. ఈనెల 29, 30 తేదీల్లో విచారణకు సంబంధించి తీర్పు వెలువడే అవకాశముంది. ముగ్గురు మైనర్ బాలికలను నమ్మించి, అత్యాచారం, హత్య చేసిన కేసులో.. శ్రీనివాస్ రెడ్డి నిందితుడిగా ఉన్నాడు.
హాజీపూర్ .. నల్గొండ జిల్లా బొమ్మలరామారం బ్లాక్లో చిన్నగ్రామం.. ఈ గ్రామంలో కొన్నాళ్ల క్రితం వరుసగా మైనర్ బాలికలు మాయమయ్యారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. తెలిసిన చోటల్లా వెతికి, చివరకు చేసేదేమీ లేక వారి తల్లిదండ్రులు మిన్నకుండిపోతున్నారు. 2019 మార్చిలో తొమ్మిదో తరగతి చదువుతున్న అమ్మాయి.. అదృశ్యమైంది. సాయంత్రం ఇద్దరు స్నేహితురాలితో కలిసి స్పెషల్ క్లాసులకు హాజరైన ఆ స్టూడెంట్... తర్వాత ఇంటికి చేరలేదు. దీంతో తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే చివరగా ఆమె .. అదే గ్రామానికి చెందిన మర్రి శ్రీనివాస్రెడ్డితో ఉండడాన్ని గమనించిన కొందరు వ్యక్తులు.. ఆ విషయాన్ని పోలీసులకు తెలిపారు. దీంతో వారు శ్రీనివాస్రెడ్డిని విచారించగా.. కీలక విషయాలు వెలుగు చూశాయి.
శ్రీనివాస్ రెడ్డి.. డ్రగ్స్కు బానిసై.. అమ్మాయిలు కనిపిస్తే చాలు వారిని మాయమాటలు చెప్పేవాడు. వారిని బుట్టలో వేసుకొని ..వ్యవసాయ బావి దగ్గరకు తీసుకెళ్లి అత్యాచారం జరిపి హత్య చేసేవాడు. తొలుత ఓ అమ్మాయిని చంపి, బావిలో పడేసిన తర్వాత, మరింత రెచ్చిపోయిన శ్రీనివాస్ రెడ్డి.. మరో ఇద్దరు మైనర్లను అదే తరహాలో హత్య చేశాడు. శ్రీనివాసరెడ్డిని తీసుకెళ్లిన పోలీసులు... అతను చూపించిన బావిలో తవ్వకాలు చేపట్టగా.. ఓ మృతదేహం, రెండు అస్థిపంజరాలు లభించాయి. దీంతో శ్రీనివాస్ రెడ్డి ఘాతుకాలపై రగిలిన స్థానికులు.. అతడి ఇంటిని కాల్చేశారు.
హాజీపూర్ ఘటనపై నల్లగొండ కోర్టులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకాగా.. ... 20 రోజుల క్రితం ట్రయల్ మొదలైంది. త్వరలోనే విచారణ ముగియనుండటంతో.. ఈనెల 29,30 తేదీల్లో తీర్పు వచ్చే అవకాశముంది. ప్రస్తుతం వరంగల్ జిల్లాలో రిమాండ్ ఖైదీగా శ్రీనివాసరెడ్డి ఉన్నాడు.