జైల్లోనే చంపేస్తారా... నిర్భయ నిందితులపై దాడి..
దేశాన్ని కుదిపేయడమే కాకుండా...నిర్భయ చట్టం రావడానికి కారణమైన ఘటనలో అనేక ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. 2012లో ప్యారామెడిక్ విద్యార్థినిని గ్యాంగ్రేప్ చేసి చంపేసిన కేసులో మొత్తం ఆరుగురు దోషులుండగా వారిలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకొని మరణించాడు. మరోవ్యక్తి బాలనేరస్థుల శిబిరంలో శిక్షను అనుభవించి విడుదలయ్యాడు. మిగిలిన నలుగురిలో ముగ్గురు సుప్రీంకోర్టుకు క్షమాభిక్ష పిటిషన్ సమర్పించుకోగా తిరస్కరించింది. తాజాగా వారికి రాష్ట్రపతి సైతం క్షమాభిక్ష పెట్టడానికి మొగ్గుచూపకపోవడం...ఇదే సమయంలో నలుగురు దోషులను ఉరితీయాలనే ప్రక్రియ పూర్తవడంతో... త్వరలో ఉరితీయనున్నారు.
నిర్భయ కేసు దోషుల విషయంలో....అప్పటికే విధించిన ఉరి శిక్షను మార్చడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో దోషులైన ముఖేశ్, వినయ్, పవన్, అక్షయ్లకు ఉరే సరి అని ఈ సందర్భంగా సుప్రీం స్పష్టంచేసింది. ట్రయల్ కోర్టు విధించిన శిక్షను సమర్థించింది. బాధితురాలికి అయిన తీవ్ర గాయాలు, దోషులు తీవ్ర నేరానికి పాల్పడినందు వల్ల ఉరి శిక్ష విధించాలన్న కింది కోర్టు తీర్పును సమర్థిస్తున్నాం అని ఆ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. దీనిని అత్యంత అరుదైన కేసుగా ధర్మాసనంలోని ముగ్గురు న్యాయమూర్తులు అభివర్ణించారు. కోర్టు రూమ్లో ఉన్న లాయర్లు, నిర్భయ తల్లిదండ్రులు చప్పట్లతో ఈ తీర్పును స్వాగతించారు. ఈ కేసు తీవ్రతను చూస్తే ఉరి శిక్ష తప్ప ఏ శిక్ష విధించినా తక్కువే అని ఈ సందర్భంగా జస్టిస్ దీపక్ మిశ్రా అన్నారు. జస్టిస్ దీపక్ మిశ్రా, ఆర్. భానుమతి, అశోక్ భూషన్లతో కూడిన ధర్మాసనం మార్చి 27న విచారణను ముగించి తీర్పు ఇచ్చింది.
మరోవైపు, ఇటీవల నిర్భయ హత్యాకాండ నిందితుడు వినయ్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు క్షమాభిక్ష ప్రసాదించమంటూ రాష్ట్రపతికి లేఖ రాసినట్లు వచ్చిన వ్యాఖ్యలను ఖండించాడు. తానెన్నడూ క్షమాభిక్ష కోరలేదన్నాడు. తన పేరుతో రాష్ట్రపతికి చేరిన క్షమాభిక్ష పిటిషన్ను ఉపసంహరించుకునే అవకాశం కల్పించాలన్నాడు. మరోవైపు....దరాబాద్ లో దిశ సంఘటన తర్వాత దేశ వ్యాప్తంగా అత్యాచారాలు, హత్యలపై నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో వినయ్ శర్మ పిటిషన్ ను రిజెక్ట్ చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం వేగంగా నిర్ణయం తీసుకుంది. ఇదే నిర్ణయాన్ని సమర్థిస్తూ శుక్రవారమే కేంద్ర హోంశాఖ రాష్ట్రపతికి రికమెండ్ చేసింది. దీనిపై రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవడానికి ముందే వినయ్ శర్మ పిటిషన్ ను వెనక్కి తీసుకున్నాడు. ఇదిలాఉండగా, తీహార్ జైలులో నిర్భయ అత్యాచార ఘటనలో నిందితుడు వినయ్శర్మపై దాడి జరిగింది. ఈ దాడిలో నిందితుడు వినయ్ శర్మ చేతికి గాయాలయ్యాయి.