ప్రియాంక హత్య కేసు : అన్ని పీఎస్ లోనే..
షాద్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఈ ఉదయం నుంచి ఉద్రిక్త కరమైన పరిస్థితులు నెలకొన్నాయి. నిందితులను సీపీ ఆఫీస్ నుంచి షాద్ నగర్ కు తీసుకొచ్చారు అని తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున జనాలు షాద్ నగర్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఉదయం నుంచి అక్కడే ఉండి నినాదాలు చేస్తున్నారు. నిందితులను లోపల ఉంచి మేపుతున్నారని, ఇది దారుణం అని, వాళ్ళను బయటకు విడిచిపెడితే.. వాళ్ళ సంగతి మేము చూసుకుంటామని అంటున్నారు. అరగంటలో రేప్ చేసి చంపితే.. తప్పు చేసారని తెలిసి కూడా నిందితులను ఎందుకు శిక్షించకుండా వదిలేస్తున్నారని వాపోతున్నారు.
బహిరంగంగా ఉరి తీయాలని, లేందంటే వెంటనే ఎన్ కౌంటర్ చేయాలని ప్రజలు పెద్ద ఎత్తున షాద్ నగర్ పోలీస్ స్టేషన్ కు చేరుకోవడంతో.. అక్కడ పరిస్థితి చేజారిపోయింది. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ కు వచ్చే అన్ని దారులను పోలీసులు మూసేశారు. ఎక్కడికక్కడ బారీకేడ్లు నిర్మించడంతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. పైగా కొంతమందిపై లాఠీఛార్జ్ కూడా చేయడంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తకరంగా మారిపోయింది.
అయితే, అధికారికంగా ప్రభుత్వం దీనిపైన ఇప్పటి వరకు స్పందించలేదు. ఎందుకు స్పందించలేదు తెలియడం లేదు. ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకు అంత అలసత్వాన్ని ప్రదర్శిస్తుందో తెలియడం లేదు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తున్నదని ప్రశ్నిస్తున్నారు. పోలీస్ స్టేషన్ లకు పెద్ద ఎత్తున జనాలు చేరడంతో పోలీస్ స్టేషన్ నుంచి నిందితులను బయటకు తీసుకురాలేకపోతున్నారు.
దీంతో ఉదయం ప్రభుత్వ వైద్యులు వైద్య పరీక్షలను పోలీస్ స్టేషన్ లోనే నిర్వహించారు. ఆ తరువాత కోర్టుకు తీసుకెళ్లాలి...కానీ, ప్రజలు పెద్ద ఎత్తున షాద్ నగర్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడంతో..నిందితులను బయటకు తీసుకురావడానికి కుదరలేదు. దీంతో మేజిస్ట్రేట్ ను పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి అక్కడే విచారించారు. నిందితులకు 14 రోజులపాటు రిమాండ్ కు తరలించారు. సోమవారం రోజున పోలీసులు ఈ నిందితులను తమ కస్టడీకి అప్పగించాలని కోరే అవకాశం ఉన్నది. అయితే, ఈ సమయంలో షాద్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఎలాంటి అలసత్వం ప్రదర్సించనా పోలీస్ స్టేషన్ పూర్తిగా ధ్వంసం చేసి నిందితులను చంపేసే అవకాశం ఉంది.