శివసేన.. కాంగ్రెస్.. ఈ రెండు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ఎవరూ కూడా కలలో కూడా ఊహించరు. అటువంటి సందర్భం వస్తుంది అని కూడా ఎప్పుడూ ఎవరూ అనుకోలేదు. కానీ, కొన్ని మాత్రం అనుకోకుండానే జరిగిపోతుంటాయి. అలా జరిగిపోయే వాటిని మనం ఆపలేము. అవి అలా జరుగుతుండాల్సిందే. దానిని ఎవరూ అడ్డుకోలేరు. ఇక ఇదిలా ఉంటె, మహారాష్ట్రలో ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అడ్డంకులు తొలగిపోతున్నాయి.
మహారాష్ట్రలో శివసేన బీజేపీ నుంచి బయటకు వచింది. బీజేపీ 50 50 అని ఎన్నికలకు ముందు మాట్లాడారని, కానీ, ఎన్నికల తరువాత దానిని పక్కన పెట్టినట్టు శివసేన చెప్పింది. ముఖ్యమంత్రి పదవి తమకే కావాలని శివసేన పట్టుపట్టగా, బీజేపీ అందుకు ససేమిరా అనడంతో శివసేన బయటకు వచ్చి కాంగ్రెస్, ఎన్సీపీతో పొత్తు పెట్టుకునే దిశగా అడుగులు వేసింది.
శివసేన పార్టీ పొత్తుకు సంబంధించిన అన్ని ఏర్పాటు సిద్ధం చేసుకుంటోంది. పొత్తులో భాగంగా శివసేన అభ్యర్థికే ముఖ్యమంత్రి పీఠం ఇవ్వాలని ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ మహాలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే.. పాలన ఎలా ఉండబోతుంది అన్నది ఎవరికీ అర్ధంకాని విషయం. ఎందుకంటే దృఢమైన ప్రభుత్వం లేకుంటే.. దానివలన ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అన్నది గతంలో చూశాం.
అందుకే స్థిరమైన ప్రభుత్వాలు ఏర్పడాలని కేంద్రం చెప్తున్నది. శివసేన.. బీజేపీ మధ్య గతంలో పొత్తు ఉన్నప్పటికీ నిత్యం కేంద్రాన్ని విమర్శిస్తూనే ఉన్నది. అయినప్పటికీ బీజేపీ ఆ మాటలను బారాయిస్తూనే వస్తున్నది. ఇప్పుడు విరుద్ధంగా శివసేన కాంగ్రెస్ తో అంటకాగుతుండే సరికి మొత్తం రివర్స్ అయ్యేలా కనిపిస్తోంది. మహాలో ప్రభుత్వం ఎంతవరకు స్థిరంగా ఉంటుంది అన్నది అందరిముందున్న ప్రశ్న. శివసేన పార్టీలోని చాలా మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ తో కలిస్తే.. పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. మరి ఎలా జరుగుతుందో మరికొన్ని రోజుల్లోనే బయటకు వస్తుంది.