కవితకు కాదేది అనర్హం అన్నారు మహా కవి శ్రీశ్రీ గారు. అయితే, దోచుకోవడానికి కావాల్సింది ఎక్కడుంటేనేమి.. దోచెయ్యొచ్చు అంటున్నారు దొంగలు. దొంగతనం చేయడం అంటే మాములు విషయం కాదు. అది ఓ ఆర్ట్. ఆ ఆర్ట్ ను అద్భుతంగా ఆకట్టుకునే విధంగా చేయాలి. ఆకట్టుకునే విధంగా అంటే అందరికి తెలిసేలా కాదు. తెలియకుండా ఎవరు చేశారో... ఎలా చేశారో తెలియకుండా చేయాలి. అప్పుడే దొంగతనం చేయడం ఈజీ అవుతుంది.
మెడలో వేసుకున్న నగలను దోచేయవచ్చు. పర్సులో ఉన్న డబ్బును కొట్టెయ్యవచ్చు. కానీ, ఎవరికీ కనపడకుండా కడుపులో దాచుకున్న బంగారాన్ని కొట్టేయడం అంటే మాములు విషయం కాదు. దానికి ఎంత టాలెంట్ ఉండాలి. ఎంత నెట్వర్క్ ఉండాలి. ఎంతో చాకచక్యంగా కొట్టెయ్యాలి. చెన్నైలో ఇదే జరిగింది. ఓ ముఠా కడుపులో దాచుకున్న బంగారాన్ని ఎత్తుకెళ్లారు. దాని కథ ఏంటో తెలుసుకుందాం.
శ్రీలంక నుంచి ఇద్దరు మహిళలు చెన్నై ఎయిర్ పోర్టుకు వచ్చారు. ఆ ఇద్దరు మహిళలను స్కాన్ చేసినపుడు కడుపులో బంగారం గుళిక రూపంలో ఉన్నట్టుగా గుర్తించారు. కడుపులో ఉన్న బంగారాన్ని బయటకు తీసేందుకు... అధికారులు ఆ ఇద్దరు మహిళను హాస్పిటల్ కు తీసుకెళ్తున్న తరుణంలో మధ్యలో ఓ 10 మంది దొంగల ముఠా అడ్డు తగిలింది.
కారులో ఉన్న వ్యక్తులను కత్తులతో, తుపాకులతో బెదిరించారు. ఆ ఇద్దరు మహిళలని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసిన వ్యక్తుల కోసం, కిడ్నాప్ కాబడిన మహిళల కోసం విచారణ జరుపుతున్న సమయంలో ఆ ఇద్దరు మహిళలు ఎంచక్కా ఎయిర్ పోర్ట్ కు రావడం చూసి షాక్ అయ్యారు. వారిని ప్రశ్నిస్తే.. తమ కడుపులో ఉన్న బంగారం లాగేసుకున్నారని చెప్పారు. దీంతో పోలీసులు ఈ దిశగా విచారణ చేస్తున్నారు. దొంగల ముఠా వారిని ఎలా విడిచిపెటింది అనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు.