ఈఎస్ఐకి చెందిన ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ (ఐఎంఎస్) మాజీ డైరెక్టర్ దేవికారాణికి సంబంధించి ప్రతిరోజూ కొత్త లీలలు వెలుగుచూస్తున్నాయి. అక్రమంగా దోచుకున్న డబ్బుతో ఆమె విలాసవంతమైన జీవితాన్ని గడిపినట్లు అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులు గుర్తించారు.మందుల డబ్బును దోచుకునేందుకు అందుబాటులో ఉన్న అన్నిరకాల అడ్డదారులను ఆమె ఉపయోగించారు.
తన వద్ద పనిచేసే కొడాలి నాగలక్ష్మి సాధారణ ఫార్మాసిస్ట్ అయినప్పటికీ ఆమె కూడా కోట్ల రూపాయల అక్రమార్జన గడించడం విశేషం తన అనుచరురాలు ఫార్మాసిస్ట్ నాగలక్ష్మితో కలసి 2 డొల్ల కంపెనీలు సృష్టించారు.అక్రమమార్గంలో కోట్ల రూపాయలు సంపాదించిన డబ్బును దేవికారాణి, నాగలక్ష్మి, విలాసాలకు విచ్చలవిడిగా ఖర్చు చేశారు. ఏ ప్రభుత్వ ఉద్యోగీ కలలో కూడా ఊహించనంత డబ్బు రావడంతో జల్సా జీవితాలకు అలవాటు పడ్డారు. ఖరీదైన హోటళ్లలో బర్త్డే పార్టీలు, విందులు, వినోదాలు, పబ్లు అంటూ అందుబాటులో ఉన్న ప్రతీ విలాసాన్నీ అనుభవించారు.
2016–18లో మహీధర మెడికల్ అండ్ సర్జికల్స్ కంపెనీకి రూ.3,69,58,500 విలువైన పర్చేజ్ ఆర్డర్లు ఇచ్చారు. ఈ మందులు రేట్ కాంట్రాక్ట్ కంపెనీ (ఆర్సీ)ల ద్వారా కొనుగోలు చేస్తే వాస్తవానికి కేవలం రూ.61,99,972 మాత్రమే ఖర్చయ్యేది. జై సాయిరాం కంపెనీకి రూ.4 కోట్ల పర్చేజ్ ఆర్డర్ ఇచ్చారు. ఇదే రేటెడ్ కంపెనీలో వీటి విలువ రూ.1.12 కోట్లు మాత్రమే.రాజేశ్వర్రెడ్డి తమ్ముడు శ్రీనివాసరెడ్డికి సంబంధించిన వైష్ణవి ఎంటర్ప్రైజెస్కు రూ.5.50 కోట్ల విలువైన ఆర్డర్లు ఇచ్చారు. ఇవి రేట్ కాంట్రాక్ట్ ప్రకారం రూ.1.41 కోట్లు మాత్రమే.
తేజా ఫార్మా ఎండీ రాజేశ్వర్రెడ్డి, అతడి సోదరుడు శ్రీనివాసరెడ్డిలకు మొత్తం 8 డొల్ల కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలకు వచ్చిన కాంట్రాక్టులన్నీ నిబంధనలకు విరుద్ధంగా దేవికారాణి కట్టబెట్టినవే కావడం గమనార్హం. ఇలా వచ్చిన ఆదాయాన్ని పీఎంజే జ్యువెలరీస్కు మళ్లించారు.మహీధర మెడికల్ అండ్ సర్జికల్, జై సాయిరాం డిస్ట్రిబ్యూటర్స్, ఎస్ఎస్ అసోసియేట్స్, సాయి శ్రీనివాస తదితర కంపెనీలకు ప్రాసెసింగ్, ఇన్వాయిస్, కొటేషన్స్ చేసి దాని ద్వారా వచ్చిన సొమ్మును నేరుగా అప్పటి డైరెక్టర్ దేవికారాణికి లేదా ఆమె సూచించిన వ్యక్తులకు అందజేసేవారు.మొత్తంగా ఇలా అక్రమమార్గాల్లో దాదాపు రూ.10.85 కోట్ల మేరకు దేవికారాణి ముఠా కాజేసినట్లు ఏసీబీ పరిశీలనలో వెల్లడైంది.
.