కడివెడు పాల కుండలో ఒక్క ఉప్పు గల్లు తుఫాను సృష్టించినట్టుగా.. రాష్ట్రంలోని యూనివర్సిటీలకు దేశంలోను, విదేశాల్లోనూ ఉన్న మంచి పేరు, అత్యుత్తమమనే పేరును.. ఒకే ఒక్క వ్యక్తి కాలరాస్తున్నారనే అపవాదు వినిపిస్తోంది. ఇలా అయితే, రాష్ట్ర వర్సిటీలకు అంతర్జాతీయంగా ఉన్న పేరు కూడా మాసిపోదా ? అనే ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి. విషయంలోకి వెళ్తే.. యూనివర్సిటీలు అంటే.. రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన రాజ్యాంగ బద్ధ సంస్థలుగా పేర్కొన్నారు.. మాన్య శ్రీ దివంగత రాష్ట్రపతి వెంకటరామన్. అలాంటి విశ్వవిద్యాలయాలు నేడు రాజకీయాలతోనే పాలన సాగిస్తున్నాయి.
ఓ పార్టీకి కొమ్ముకాసే పాలక యంత్రాగం విశ్వవిద్యాలయాల్లో తిష్టవేసిన ఫలితంగా తాము తీసుకునే నిర్ణయాలను ఎవరూ ప్రశ్నించజాలరని, ఎవరు ప్రశ్నించినా.. వారిని సమాధి చేస్తాం అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. దీంతో ఒక్క యూనివర్సిటీ చేస్తున్న తప్పు అన్ని యూనివర్సిటీలకూ పాకుతోంది. గతంలో ద్రవిడ యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు స్వయంగా పుస్తకాలు అందించి పరీక్షలు రాసేలా ప్రోత్సహించి వారి నుంచి డబ్బులు వసూలు చేసిన విషయం బయటపడిన తర్వాత ఇప్పటికీ.. కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే విలువ లేకుండా పోయింది. ఇలాంటి ఘటనలు ఇప్పటికీ చాలానే జరుగుతున్నాయని మీడియా ఎప్పటికప్పుడు బయట పెడుతూనే ఉంది.
తాజాగా శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీకి చెందిన ఇంచార్జ్ రిజిస్ట్రార్ తన ఆధిపత్యంతో వర్సిటీ పరువును గంగలో కలుపుతున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ వర్సిటీ పరువును బజారో పెట్టేశారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఓ సంస్థ ఈ వర్సిటీకి సంబంధించిన సాంకేతిక పనులను నిర్వహిస్తోంది. దీనికి నిధులు సమకూర్చి, పనులు చేయించుకునే బాధ్యత సదరు ఇంచార్జ్ రిజిస్ట్రార్పైనే ఉంది. అయితే, ఆయనకు రాజకీయ వాసనలు బాగా పట్టడంతో ప్రతి పనికీ ఇంతని లెక్కగట్టి వసూళ్లు చేస్తున్నారన్న విమర్శలు వర్సిటీ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి. దీంతో ఆ సంస్థకు చెందిన బిల్లులు వసూలు చేయడం మానేసి తన లెక్కలు తాను వేసుకుంటూ పొద్దు పుచ్చుతున్నారని వర్సిటీలో ఆయన తీరు నచ్చని వారు గుసగుసలాడుకుంటున్నారు.
దీనిని ప్రశ్నించిన సంస్థ ఉద్యోగిని, వికలాంగుడు అని కూడా చూడకుండా బెదిరింపులు పాల్పడడంతో పాటు ఆయన నుంచి బలవంతంగా సంతకాలు సేకరించిన ఆ ఇంచార్జ్ రిజిస్ట్రార్ విషయం రాష్ట్ర వ్యాప్తం గా సంచలనంగా మారింది. అంతకాదు, ఇదేంటి సార్ ? అని ప్రశ్నించిన ఆయనను నీ అంతు చూస్తా ! అని బెదిరించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. దీంతో ఇంచార్జ్ రిజిస్ట్రార్పై విద్యార్థులు, విద్యార్థి సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి., ఇలా అయితే, వర్సిటీ పరువు పోదా సార్ ? అని నినదిస్తున్నాయి. మరి ఈయనపై ప్రభుత్వమైనా చర్యలు తీసుకోవాలి. లేదా ఛాన్స్లర్గా ఉండే.. గవర్నర్ అయినా చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో ? చూడాలి.