తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో సీఎం పీఠం దక్కించుకోవడమే టార్గెట్గా దూసుకు వెళుతోన్న బీజేపీ అక్కడ ఏ పార్టీకి చెందిన నేతలు వచ్చినా కండువాలు కప్పేస్తోంది. ఇప్పటికే టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకుని బీజేపీ ఇప్పుడు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నేతలను కూడా వదలడం లేదు. టీఆర్ఎస్లో తీవ్ర అసంతృప్తితో ఉన్న నేతలపై వలవేసి మరీ కండువాలు కప్పేస్తోంది. తాజాగా దసరాకు జరిగే కేబినెట్ ప్రక్షాళన తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు సైతం టీఆర్ఎస్కు షాక్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదన్న ప్రచారం కూడా జరుగుతోందంటే గులాబీ దళంలో అసంతృప్తి ఎలా ఉందో తెలుస్తోంది.
దీనిని క్యాష్ చేసుకునేందుకు కాచుకుని ఉన్న బీజేపీ కేసీఆర్కు అదిరిపోయే షాకులు ఇచ్చేలా చాపకింద నీరులా దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే బీజేపీ టీఆర్ఎస్ బలంగా ఉన్న ఉమ్మడి వరంగల్ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇతర పార్టీల నుంచి పలువురు కీలక నేతలను లాగేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. టీడీపీ సీనియర్ నేత రేవూరి ప్రకాశ్రెడ్డి, మాజీ ఎంపీ రవీంద్రనాయక్ బుధవారం బీజేపీలో చేరిపోయారు. ఇక ఇప్పుడు తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎంను టార్గెట్ చేసినట్టు టాక్.
దళిత సామాజికవర్గం నుంచి కీలక నేతలను తీసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మొన్నటికిమొన్న వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కొండేటి శ్రీధర్ను బీజేపీలోకి తీసుకుంది. ఇప్పుడు టీఆర్ఎస్లో కక్కలేక.. మింగలేక ఉన్న కడియం శ్రీహరితో పాటు ఆయన కుమార్తె డాక్టర్ కావ్యపై బీజేపీ గురి పెట్టినట్టు టాక్. జిల్లాకే చెందిన మంత్రి ఎర్రబెల్లితో కడియంకు దశాబ్దాల వైరం ఉంది. కేసీఆర్ తన సామాజికవర్గానికి చెందిన ఎర్రబెల్లికి ప్రయార్టీ ఇస్తూ తనను పక్కన పెట్టడంతో కడియం జీర్ణించుకోలేకపోతున్నారు.
కొద్ది రోజుల క్రితమే కడియం బీజేపీ వైపు ఉన్నారని వార్తలు వచ్చినా ఆయన ఖండించారు. ఆయనతో పాటు ఆయన కుమార్తె బీజేపీలోకి వెళితే ఆ పార్టీ నుంచి భారీ ఆఫర్లు లైన్లో ఉన్నాయట. వారు కోరుకున్న టిక్కెట్లతో పాటు పార్టీలో పదవులు ఉంటాయన్న హామీ ఇచ్చినట్టు టాక్? నిజానికి కడియం శ్రీహరి తన కూతురు కావ్యకు స్టేషన్ఘన్పూర్ టికెట్ లేదా వరంగల్ పార్లమెంట్ టికెట్ ఇప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అయితే కేసీఆర్ కడియంకు ఏ టిక్కెట్ ఇవ్వకుండా చెక్ పెట్టారు. ఇక ఇప్పుడు కడియంను పట్టించుకునే వారే లేరు. అటు కడియం కుమార్తె కావ్య కూడా ఎస్సీల్లో భవిష్యత్తు ఉన్న మహిళా నేతగా ఎదిగే ఛాన్స్ ఉంది. అందుకే ముందుగా కావ్య బీజేపీలో చేరతారని. తర్వాత కడియం కూడా కాషాయం గూట్లోకి వెళ్లిపోతారన్న గుసగుసలు వరంగల్లో నడుస్తున్నాయి. మరి ఈ తండ్రి, కుమార్తెల రూటు ఎలా ఉంటుందో ? చూడాలి.