టీడీపీ రాజ్యసభ సభ్యలు వరుస పెట్టి ఒక్కసారిగా చంద్రబాబుకు బై చెప్పారు. మూకుమ్మడిగా వెళ్లి కమలం గూటిలో చేరి పోయారు. ఈ పరిణామాల వెనుక ఏం జరిగింది? ఎవరు ఉన్నారు? అనే విషయాలు తాజాగా తెరమీదికి వస్తున్నాయి. ప్రస్తు తం టీడీపీ ఎంపీలు పార్టీ మారిన విషయం ఒక్కరోజులోనో.. రెండు రోజుల్లోనో జరిగిందంటే నమ్మే పరిస్థితి కనిపిం చడం లేదు. ఇది చాలా వ్యూహాత్మకంగా దాదాపు రెండు నెలల నుంచి జరుగుతున్న పరిణామంగా ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. విషయంలోకి వెళ్తే.. ఈ మొత్తం పరిణామానికి సూత్రధారి, పాత్ర ధారి కూడా సుజనా చౌదరేనని అంటున్నారు. 2014 ఎన్నికల తర్వాత కేంద్రంలోని బీజేపీతో చెలిమి చేసిన చంద్రబాబు.. అక్కడ కేంద్రంలోనూ ఇక్కడ రాష్ట్రంలోనూ పదవులను పంచుకున్నారు.
ఈ క్రమంలోనే సుజనాకు కేంద్ర మంత్రిగా పదవిని కట్టబెట్టేలా చక్రం తిప్పారు. దీంతో ఆయన వ్యాపార సామ్రాజ్యం అనూహ్యంగా విస్తరించింది. అప్పటికి కేవలం రెండు మూడు రాష్ట్రాలకే పరమితమైన సుజనా గ్రూప్ వ్యాపారం.. తర్వాత కాలంలో ఆరు రాష్ట్రాలకు విదేశాలకు కూడా విస్తరించింది. ఇదంతా జగమెరిగిన సత్యం. ఇదంతా కూడా తాను కేంద్ర మంత్రిగా ఉండడం వల్లే సాధ్యమైందని ఆయనకు కూడా తెలుసు. అయితే, ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచే క్రమంలో చంద్రబాబు.. తన మంత్రులతో రాజీనామా చేయించారు.
ఈ పరిణామం సమయంలోనే కీలకమైన విషయం వెలుగు చూసింది. రాజీనామాలు చేయడం వల్ల ఫలితం ఏంటని ఢిల్లీలోనే సుజనా వ్యాఖ్యానించారు. అయితే, అప్పటికి ఇంకా బీజేపీ నేతలతో అంతగా తన బంధం ముడిపడకపోవడం, రెండోసారి చంద్రబాబు తనను రాజ్యసభకు పంపించారనే సానుభూతితో ఆయన అప్పటికి రాజీనామా చేసినా.. పార్టీకి, చంద్రబాబుకు దూరం పాటిస్తూ.. వచ్చారు. ఇక, ఎన్నికల్లో ఇప్పుడు ఏపీలో చంద్రబాబు ఘోర పరాజయం తర్వాత ఇక, ఈ పార్టీలో ఉండడం వేస్టని పూర్తిగా నిర్ణయానికి వచ్చిన సుజనా.. వ్యూహాత్మకంగా కమల నాథులతో చెలిమి చేశారు. ఏదేమైనా టీడీపీలోనే ఉంటూనే టీడీపీ గుట్టు బీజేపీకి చేతికి ఇచ్చేశాడు.
ఈ క్రమంలోనే వ్యూహాత్మకంగానే నలుగురిని వెంటబెట్టుకుని ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, ఈ మొత్తం ఎపిసోడ్లో భారీగా లబ్ధి పొందింది మాత్రం సుజనానే. ఆయనకు కేంద్ర మంత్రి నేరుగా లేదా సహాయక హోదాలో దక్కడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి వర్గ కూర్పు అయిపోయినా.. రాబోయే రెండేళ్లలో మళ్లీ మంత్రి వర్గ విస్తరణ ఉండడంతో.. సుజనాకు పదవి ఖాయమని బీజేపీ నుంచి సంకేతాలు వచ్చాయి. అందుకే ఆయన ఇంతటి సాహసం చేశారని అంటున్నారు ఢిల్లీ రాజకీయ నేతలు మరి ఏం జరుగుతుందో చూడాలి.