జగన్ కాళేశ్వరం వెళ్తే.. వై.ఎస్. ఆత్మ క్షోభిస్తుందా ?
కెసిఆర్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మిస్తున్న కాలేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈనెల 21న వైభవంగా కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించాలని కెసిఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు ఘనంగా సాగుతున్నాయి.
మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, ఏపీ సీఎం జగన్ కాలేశ్వరం ప్రారంభోత్సవానికి హాజరుకానున్నారు. అయితే కాలేశ్వరం ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్ హాజరైతే వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మ క్షోభిస్తుందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు పునాది వేసింది రాజశేఖర్ రెడ్డి.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కెసిఆర్ రీ డిజైనింగ్ చేయించి కాలేశ్వరం ప్రాజెక్టు గా మార్చారు. ఇలా మార్చడం కేవలం కమిషన్ల కోసమేనని తెలంగాణ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఏపీ సీఎం జగన్ కూడా గతంలో తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకించారు.
అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కాలేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరైతే వైయస్ రాజశేఖరరెడ్డి ఆత్మ క్షోభిస్తుందని తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అంటున్నారు. ఈ కార్యక్రమానికి జగన్ హాజరైతే కేసీఆర్ దోపిడీని సమర్థించినట్లేనని భట్టి చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ తరహాలోనే తెలంగాణలోనూ ప్రాజెక్టులకు సంబంధించిన ఫైలు జ్యుడీషియల్ కమిటీ ముందు ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు భట్టి విక్రమార్క.