ఏపీలో ఎన్నికలు ముగిసినా.. ఉత్కంఠ మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఎక్కడికక్కడ వైసీపీ వర్సెస్ టీడీపీ అభ్య ర్థుల మధ్య పోరు హోరా హోరీగా సాగింది. ఎవరూ తక్కువ తినలేదన్నట్టుగా పోరులో తలపడ్డారు. దీంతో ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీ, టీడీపీ అభ్యర్థుల మధ్య ఉత్కంఠ భరితమైన పోటీ నెలకొంది. ఎవరు గెలిచినా.. మెజారిటీ స్వల్పమే ననే నియోజకవర్గాలు కూడా తెరమీదికి వచ్చాయి. ఇక, ఇలాంటి ఆసక్తికర నియోజకవర్గం అనంతపురం జిల్లాలోని శింగనమల. ఎస్సీవ ర్గానికి కేటాయించిన ఈ నియోజకవర్గంలో 2014 ఎన్నికలో టీడీపీ సీనియర్ నేత శమంతకమణి కుమార్తె యమినీ బాల పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతిని ఓడించి విజయం సాధించారు.
ఇక, తాజా ఎన్నికల విషయానికి వస్తే.. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే యామినీబాలను పక్కను పెట్టింది. ఈమెపై వచ్చిన విమర్శలు, క్షేత్రస్థాయిలో వ్యతిరేకత, సర్వేల్లో ప్రతికూలంగా మార్కులు పడడంతోపాటు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కూడా యామినిని తప్పించాలంటూ.. అధిష్టానంపై చేసిన వత్తిడితో చంద్రబాబు ఇక్కడ నుంచి తొలిసారి రాజకీ యాల్లోకి వచ్చిన బండారు శ్రావణికి అవకాశం కల్పించారు. ఇక, వైసీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన జొన్నలగడ్డ పద్మావతికే జగన్ టికెట్ ఇవ్వడంతో పోరు ఉత్కంఠగా మారింది. గత ఎన్నికల్లో ఓడిపోయినా.. ఐదేళ్ల కాలంలో ప్రజలకు సన్నిహితంగానే మెలిగారు పద్మావతి.
అయితే, కొత్తగా అరంగేట్రం చేసిన శ్రీదేవి కూడా తానేమీ తక్కువ కాదన్నట్టుగా ప్రచారంలో దూసుకుపోయారు. ఇటు టీడీపీ అభ్యర్థి, అటు వైసీపీ అభ్యర్థి కూడా హోరా హోరీగా ప్రచారం కొనసాగించారు. ఇరు కుటుంబాలు కూడా ప్రచారంలో పాల్గొన్నాయి. దీంతో ఎన్నికల సమయానికి ఇద్దరు మహిళామణుల ప్రచారం కూడా ఊపందుకుంది. చంద్రబాబు ప్రవేశ పెట్టిన పథకాలు, ముఖ్యంగా మహిళలకు అందించిన పసుపు-కుంకుమ తమకు లాభిస్తుందని టీడీపీ అభ్యర్థి శ్రీదేవి భావిస్తున్నారు. ఇదే సమయంలో జగన్ కోసం జనంలో వచ్చిన మార్పు తనకు ప్లస్ అవుతుందని పద్మ అనుకుంటున్నారు.
హోరా హోరీ పోరుసాగిన ఈ నియోజకవర్గం జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు సాధించింది. గత ఐదేళ్లలో ఎమ్మెల్యే యామినీబాల, ఎమ్మెల్సీ శమంతకమణి తల్లికూతుళ్లే అయినా వీరి తీరుతో మళ్లీ టీడీపీని గెలిపించాలంటే శింగనమల నియోజకవర్గ ప్రజలు భయపడిపోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇక గత ఐదేళ్లలో ఓడినా పద్మావతి ప్రజల్లోనే ఉన్నారు. అంతకు ముందు మూడేళ్లుగా ఆమె నియోజకవర్గ ప్రజలతోనే కంటిన్యూ అయ్యారు. ఈ సారి ఏపీలో జగన్కు ఓ ఛాన్స్ ఇవ్వాలని ప్రజలు అనుకున్నట్టే.. ఇక్కడ కూడా పద్మావతిని గెలిపించాలన్న తాపత్రయం ఓటర్లలో ఉంది. దీంతో ఇక్కడ ఎవరి అంచనాలు ఎలా ? ఉన్నా వైసీపీకే ఆధిక్యం కనపడుతోంది.