మేం ఏదైనా చేస్తే అద్భుతం... రాజకీయ ప్రత్యర్థులు చేస్తే అది అరాచకం అని ప్రొజెక్ట్ చేసుకోవడంలో తెలుగుదేశం పార్టీకి మించిన సిద్ధహస్తులు ఎవ్వరూ లేరు. గురువారం ఎన్నికల్లో తాడిపత్రి, రాప్తాడు, నరసారావుపేటలో జరిగిన సంఘటనల్లో అసలు విషయాన్ని పక్కన పెట్టేసి అవన్నీ వైసీపీ అరాచకాలే అని ప్రచారం చేశారు టీడీపీ నేతలు. చివరకు సత్తెనపల్లిలో జరిగింది ఒకటైతే అక్కడ టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాద్రావు సానుభూతి కోసం మరోలా ప్రచారం చేసారన్నది అందరికి తెలిసిందే. అక్కడ ఆయన్ను కొట్టింది ఎవరు ? ఆయన బయటకు వచ్చి ఎవరు కొట్టారని చెప్పుకున్నారో అన్న దానికి పొంతన లేదు. అయితే ఇందుకు భీన్నంగా పవన్ కళ్యాణ్ ఎన్నికల వేల ఓ విషయాన్ని నిక్కచ్చిగా ఒప్పుకుని ఆదర్శంగా నిలవడంతో పాటు తన బాధ్యతను గుర్తెరిగి వ్యవహరించడంపై సర్వత్ర ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి.
అసలు విషయంలోకి వెళ్తే అనంతపురం జిల్లా గుంతకల్లు జనసేన అభ్యర్థి కొట్రికె మధుసూదన్ గుప్త ఈవీఎంపై అభ్యర్థుల పేర్లు సరిగా లేవన్న ఆవేశంతో పోలింగ్ భూత్లోకి వెళ్లి ఈవీఎంను ఆయన నేలకు వేసి కొట్టిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తం అయ్యాయి. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్న పవన్ను మీడియా ప్రతినిధులు మధుసూదన్ గుప్త ఈవీఎం పగలుకొట్టిన విషయంపై ప్రశ్నించగా పవన్ చాలా బాధ్యతగా బదులిచ్చారు. ఈవీఎంలో లోపాలు ఉన్న మాట నిజమేనని అయితే ఈవీఎంను పగలుకొట్టడం మాత్రం తప్పే అని ఒప్పుకున్నారు. ఒకవేళ అదే పరిస్థితుల్లో టీడీపీకి చెందిన ఏ అభ్యర్థి అయినా ఈవీఎంను పగలుకొడితే ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పందన మాత్రం తమ తప్పేం లేదని... తప్పంతా ప్రత్యర్థి పార్టీ మీద నెట్టివేసేందుకు ప్రయత్నించడంలో ఏ మాత్రం సందేహించరన్నది రాజకీయ వర్గాల్లో వినిపించే టాక్.
అసలు ఈవీఎంలు పగల కొట్టేందుకు ప్రయత్నించింది వైసీపీ వాళ్లే.. ఈ ప్రయత్నంలో మా అభ్యర్థి దాన్ని అడ్డుగోబోయాడు.. తప్పితే మా అభ్యర్థి తప్పేంలేదని చంద్రబాబు నిసిగ్గుగా టీడీపీ అభ్యర్థి తప్పును కవర్ చేసే ప్రయత్నం చేస్తారన్న దాంట్లో సందేహం లేదు. ఇదే అంశంపై మీడియా ప్రతినిధులు చంద్రబాబును ప్రశ్నిస్తే తమ పార్టీ చేసింది న్యాయమే కావాలంటే మీ మేనేజ్మెంట్లను అడగండి అని మీడియా ప్రతినిధులకి ఎదురు ప్రశ్న వెయ్యడం ద్వారా ఈ వార్తని టీడీపీకి పాజిటీవ్గా ప్రజెంట్ చేసేలా చేసుకోవడంలో కూడా చంద్రబాబే ఘనుడు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఒక పార్టీ అధ్యక్షుడిగా చాలా బాధ్యతతో తమ పార్టీ అభ్యర్థి చేసింది తప్పే అని చెప్పడంతో ప్రజాస్వామ్యంలో తన వంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారని చెప్పొచ్చు. పవన్ చేసిన ఈ ప్రకటనపై అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి.