నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కల్వకుంట్ల కవితకు చేదు అనుభవం ఎదురైంది. కవిత తన సిట్టింగ్ స్థానమైన నిజామాబాద్ నుంచి ఎంపీగా మరోసారి పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో ఆమె ముందు నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. పసుపు, ఎర్రజొన్న పంటలకు గిట్టుబాటు ధర, పసుపు బోర్డు ఏర్పాటు డిమాండ్లపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలనే ఉద్దేశంతో ఏకంగా 176 మంది రైతులు ఇక్కడ పోటీ చేస్తున్నారు. వీరిని పోటీ నుంచి ఉపసంహరించేలా చేసేందుకు కవిత చేతులు ఎత్తేయడంతో చివరకు టీఆర్ఎస్ అధిష్టానం ఎన్నో ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయ్యింది.చివరకు రైతులు తన నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు ఒప్పుకోకపోవడంతో ఇక్కడ పెద్ద ఎత్తున రైతులు కూడా పోటీలో ఉన్నారు.
ఈ నియోజకవర్గం నుంచి ఏకంగా 186 మంది పోటీలో ఉండడంతో దేశంలో ఒక లోక్సభ నియోజకవర్గం నుంచి ఎక్కువ మంది ఉన్న నియోజకవర్గంగా నిజామాబాద్ రికార్డులకు ఎక్కింది. ఇక తాజాగా పోలింగ్ రోజున కవిత నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని రెంజల్ గ్రామంలో పోలింగ్ సరళిని పరిశీలించేందుకు కవిత వెళ్లారు. దీంతో అప్పటికే పోలింగ్ బూత్ లో ఓటు వేసేందుకు క్యూలో నిలబడ్డ మహిళలు కవితను చూడగానే ఆమెను నిలదీశారు. ఐదేళ్లలో తమ సమస్యలు పరిష్కారం కాలేదని, ఇళ్లు లేవని, సంక్షేమ పథకాలు అందలేదని ఆమెను నిలదీశారు. ఆమె మహిళలకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. దీంతో కవిత వెనుదిరిగారు.