రాజకీయాలు చేయడం అంటే మాటలు చెప్పడం కాదు. విమర్శలు చేయడం కూడా కాదు. వ్యూహాలకు పదును పెడుతూ.. ఎప్పటికప్పుడు వ్యూ హాలను మార్చుకుంటూ.. ప్రజల నాడిని పసిగడుతూ.. ముందుకు సాగడమే! ప్రతి విషయాన్నీ తమకు అనుకూలంగా మార్చుకోవడం కూడా పార్టీ లకు అత్యంత కీలకం. వ్యూహ రచనలేని పార్టీలను ఊహించడం కూడా కష్టమే. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ నేతల్లో వ్యూహాలను పూర్తిస్థాయి లో అమలు చేస్తున్న పార్టీలను మనం లెక్కేసుకుంటే.. ఒక్క అధికార టీడీపీ మాత్రమే మనకు కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి, రెండో సారి కూడా అదికారంలోకి రావాలని గట్టి సంకల్పం చెప్పుకొన్న పార్టీ అధినేత చంద్రబాబు దీనికి అనుగుణంగా ప్రజానాడిని పట్టుకుని, ఎప్ప టికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ ముందుకు సాగుతున్నారు.
వాస్తవానికి అధికారంలో ఉన్న పార్టీగా ప్రజల్లో వ్యతిరేకత కనిపించాలి. ఈ ఐదేళ్ల కాలంలో అధికార పార్టీ చేసిన తప్పులు ఆ పార్టీకి పెను శాపంగా పరిణమించాలి. అయితే, ఏపీ అదికార పార్టీ విషయానికి వస్తే.. ఈ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. పైగా.. సానుకూల ధోరణి కనిపిస్తోంది. వాస్తవానికి ఏపీకి సంబంధించిన పాలన రెండు రూపాలుగా సాగిందనేది విశ్లేషకుల భావన. తొలి నాలుగేళ్ల కాలంలోనూ బీజేపీతో కలిసి ఉన్న చంద్రబాబు ఆ పార్టీ కేంద్రంలోని పాలకులు అనుసరించి విధానాలనే ఆయన ఇక్కడ కూడా అమలు చేశారు. ఫలితంగా ప్రత్యేక హోదా వంటి కీలక అంశాల విషయంలో చాలా మేరకు డ్యామేజీ ఏర్పడింది. అయితే, చివరి 10 నెలల కాలంలో మాత్రం చంద్రబాబు తన వ్యూహాన్ని మార్చుకున్నారు. తనకు అనుకూలంగా పరిస్థితులను మార్చుకునేందుకు ప్రయత్నించారు.
ప్రతి ఒక్కరినీ పార్టీకి సానుకూలంగా మార్చేందుకు ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. వ్యక్తిగత లబ్ధి లేనిదే ప్రజల్లో ఏ పార్టీ కూడా నిలవడం సాధ్యం కాదని భావించిన చంద్రబాబు తాజాగా ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత లబ్ధిని చేకూర్చేలా పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. ఈ పరిణామాలు పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాయి. ఇక, ఇప్పుడు ఏపీలో ఎక్కడ విన్నా కూడా టీడీపీకి సానుకూల వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి. కట్ చేస్తే.. ప్రధాన విపక్షం వైసీపీ ఈ విషయంలో చాలా వెనుబడి ఉందని అనడంలో ఎలాంటి సందేహం లేదు.వ్యూహం లేని విషయం స్పష్టంగా కనిపిస్తోంది.
ముఖ్యంగా టీడీపీతో పోల్చుకుంటే సమర్ధవంతమైన గళం వినిపించే ప్రధాన నాయకులు కానీ, ఫైర్ బ్రాండ్ రాజకీయ నేతలు కానీ వైసీపీలో కనిపించడం లేదు. ఈ పరిస్థితి ఆ పార్టీని తీవ్రస్తాయిలో ఇబ్బంది పెడుతోంది. ముఖ్యంగా ఎన్నికల సమయంలో పార్టీలో కీలకమైన నాయకులు ఎవరూ కూడా పార్టీకి సహకరించే పరిస్థితి కూడా కనిపించకపోవడం వైసీపీలో ఒకవిధమైన నిర్వేదం ఏర్పడేలా చేస్తోంది. ఇక, జగన్ కూడా టీడీపీ అధినేత చంద్రబాబుతో దీటుగా అడుగులు వేయలేక పోతున్నారనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. మరి దీనిని ఎదుర్కొని బలమైన పక్షంగా అధికారంలోకి వచ్చే దిశగా జగన్ అడుగులు ఎప్పటికి పడతాయో చూడాలి.