ఎడిటోరియల్ : ఆదాల టిడిపిలోనే ఉంటారా ? నేతల మధ్య వివాదాలు
జిల్లా నేతలను ఇపుడిదే అనుమానం బాగా
పట్టిపీడిస్తోంది. చాలా కాలంగా మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్టీ
కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తన దగ్గరకు వచ్చి కలుస్తున్న వారితో తప్ప తానుగా
ఎవరి దగ్గరకు వెళ్ళి మాట్లాడటం లేదు. ఒకపుడు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నంత
చురుగ్గా ఇఫుడు పాల్గొనటం లేదు. తాజాగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై
ఫుల్లుగా ఫైరయ్యారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం నేతలతో మంత్రి సోమిరెడ్డి సమీక్ష
చేయటమే ఆదాల కోపానికి కారణమైంది.
ఎటూ ఆదాల యాక్టివ్ గా లేరు కాబట్టే సోమిరెడ్డి పార్టీ నేతలతో సమావేశం పెట్టుంటారు. కానీ దానికి ఆదాల ఒప్పకోవటం లేదు. తాను ఇన్చార్జిగా ఉన్న రూరల్ నియోజకవర్గంలో తనకు చెప్పకుండా, తెలీకుండా సోమిరెడ్డి సమీక్ష నిర్వహించటంపై చంద్రబాబునాయుడు దగ్గరే తేల్చుకుంటానంటూ మండిపోతున్నారు. దాంతో ఆదాల వ్యవహారం జిల్లాలో హాట్ టాపిక్ అయిపోయింది. జూనియర్ మంత్రి నారాయణ దగ్గరే సోమిరెడ్డిపై ఆదాల ఫైర్ అవ్వటంతో ఏమి చెప్పాలో తెలీక నారాయణ కూడా మౌనంగా ఉండిపాయారని పార్టీ వర్గాలు చెప్పాయి.
నిజానికి ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేనాటికి ఆదాల తెలుగుదేశంపార్టీలోనే ఉంటారా ? అన్నది కూడా అనుమానంగానే ఉంది. నెల్లూరు ఎంపిగా ఆదాలను పోటీ చేయమని చంద్రబాబు ఎప్పుడో ఫైనల్ చేశారు. అక్కడ తలూపి జిల్లాకు తిరిగి వచ్చిన తర్వాత మద్దతుదారులతో మాట్లాడుతూ నెల్లూరు ఎంపిగా పోటీ చేయటం తనకు ఏమాత్రం ఇష్టం లేదని చెప్పారట. ఎవరు పోటీ చేసినా నెల్లూరు ఎంపిగా గెలుపు అవకాశాలు అంతంత మాత్రమే అన్నది ఆదాల అనుమానం.
జనాల్లో ప్రభుత్వంపై స్పష్టమైన వ్యతిరేకత కనబడుతోందనే ప్రచారంతో గెలుపుపై నేతలు నమ్మకం కోల్పోయారు. దాంతో పోటీకి సోమిరెడ్డి, నారాయణ లాంటి నేతలు కూడా వెనకాడుతున్నారు. అందుకే ఆదాల కూడా ఎంఎల్ఏ సీటుపైనే దృష్టి పెట్టారు. అయితే, చంద్రబాబు మాత్రం ఆదాలను ఎంపిగానే పోటీ చేయాలని గట్టిగా చెప్పారు. ఇక్కడే ఆదలకు సమస్య వచ్చింది. మంత్రులిద్దరూ తప్పుకుని ఓడిపోయే సీటులో తాను పోటీ చేసేట్లుగా చంద్రబాబు దగ్గర చక్రం తప్పారనేది ఆదాల అనుమానం.